ఈ నెల 21వ తేదీ సోమవారం నుండి జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 12 కేంద్రాల పరిధిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు మొదటి విడత ప్రత్యక్షంగా ఆంగ్ల మాధ్యమ శిక్షణా తరగతులు ప్రారంభం కానున్నట్లు డిఈఓ గోవిందరాజులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రతీ ఉపాధ్యాయుడు శిక్షణలో పాల్గొని ఆంగ్ల భాషపై పరిజ్ఞానం పెంపొందించుకోవాలని ఆయన పేర్కొన్నారు. సోమవారం నుండి ఆంగ్ల భాషపై 12 కేంద్రంల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మూడు విడతల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
అందుకు మండలాల వారీగా ఎంపిక చేసిన ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆయన ఆదేశించారు. గవర్నమెంట్ హై స్కూల్ అచ్చంపేట, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లింగాల, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల అమ్రాబాద్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలకపల్లి, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నాగర్ కర్నూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిమ్మాజీపేట్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు బిజినపల్లి, గవర్నమెంట్ హై స్కూల్ కల్వకుర్తి, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వెల్దండ, జెడ్ పి హెచ్ ఎస్ జి హెచ్ ఎం కొల్లాపూర్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దకొత్తపల్లి 12 కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఆంగ్ల శిక్షణా తరగతులకు ఇదివరకే కేటాయించిన మండల ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఆంగ్ల మాధ్యమం శిక్షణ తరగతులకు హాజరు కాని ఉపాధ్యాయులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇదివరకే ఆదేశాలు జారీ చేసినట్లు డీఈవో తెలిపారు. శిక్షణా తరగతులను మండల విద్యాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా సందర్శించాలని ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతన్నందున జిల్లావ్యాప్తంగా శిక్షణ పొందిన నిష్ణాతులైన ఆర్పిల ద్వారా మూడు విడతల్లో ఒక బ్యాచ్కు ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఇంగ్లీష్ శిక్షణా తరగతుల్లో తప్పనిసరిగా ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన సూచించారు. శిక్షణ ద్వారా ఉపాధ్యాయులు కమ్యూనికేషన్ స్కిల్స్ అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు.
అదేవిధంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు హైదరాబాద్ ఎస్సిఈఆర్టి నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందించే శిక్షణకు ఎంపిక చేసిన 60 మంది సబ్జెక్ట్ ఆర్పిలు హాజరు కావాలని నాగర్ కర్నూల్ డీఈవో గోవిందరాజు నేడు ఒక ప్రకటనలో కోరారు.