దేశ వ్యాప్తంగా శ్రామిక చైతన్యంతో నవంబర్ 26 వ, తేదీన శ్రమజీవుల హక్కుల కోసం జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని, కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని బీజేపీకి గుణపాఠం చెప్పాలని జిల్లా సిఐటియు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి పిలుపునిచ్చారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం రామాపురం ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీ లో కాంట్రాక్టర్ కి సమ్మె నోటీసు ఇచ్చిన అనంతరం గేట్ సమావేశంలో రోషపతి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణత్యాగాలు, జైలు శిక్షలు, తుపాకీ తూటాలకు, లాఠీ దెబ్బలకు ఎదురొడ్డి కార్మిక వర్గం సాధించుకున్న హక్కులు 44 కార్మిక చట్టాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చట్టాలు మారుస్తూ పార్లమెంట్ లో దొంగ చాటుగా బిల్లు తెచ్చిందని తెలిపారు.
పరిశ్రమల పెట్టుబడి దారులకు సకల హక్కులు ఇస్తూ కార్మికులకు ముళ్ల కిరీటం పెట్టిందని ఆయన విమర్శించారు. గత ఏడు సంవత్సరాల నుంచి సిమెంటు పరిశ్రమలలో వేజ్ బోర్డు వేతనాలు అమలు చేయటం లేదని ఆయన అన్నారు.
అప్పటి వరకు కనీసం 24 వేల రూపాయల వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 26న, జరగబోయే సమ్మెకి బిజెపికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కృష్ణ పట్టి ఏరియా సిమెంట్ క్లబ్ కమిటీ ప్రియా సిమెంట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ అధ్యక్ష్య, కార్యదర్శి తీగల శ్రీను, ఎస్ కె. అజముద్దీన్, ప్రకాష్ ,లక్ష్మయ్య, వీరబాబు, హనుమయ్య, హుస్సేన్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.