దొరల పాలనలో తెలంగాణ ఆడపడుచులు రోడ్లపైకి వస్తున్నారని అయినా దొర స్పందించడం లేదని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన 52 కోట్ల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మూడవ రోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో మహిళలు బోనాలు తీసి అమ్మవారికి సమర్పించారు.
మున్సిపల్ కార్యాలయం నుంచి చౌరస్తా మీదుగా కొట్టబస్టాండ్ వద్ద గల మైసమ్మ ఆలయం వరకు బోనాలతో ఊరేగింపు చేపట్టారు. పోతారాజుల విన్యాసాలు, ప్రత్యేక వేశదారణతో విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అనంతరం మైసమ్మకు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు స్త్రినిది, వడ్డీలేని రుణాలు, అభయహస్తం బకాయిలు 6 వేల కోట్లు రావాల్సి ఉందని, మొన్నటి బడ్జెట్లో కేవలం 15 వందల కోట్లు మాత్రమే కేటాయించారన్నారు.
సీఎం వద్ద అనవసరపు ఖర్చులకు 10 వేల కోట్లను ఉంచుకున్నారని తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గంలోనే మహిళలు రోడ్డెక్కారనని సీఎం అనుకుంటున్నారని, కామారెడ్డిలో ఉద్యమం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఎలా ఉదృతం అవుతుందో మాస్టర్ ప్లాన్ ద్వారా చూపించామని గుర్తు చేశారు. ఆ పరిస్థితి రాకుండా వెంటనే బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే నిరసన దీక్షలు మొదలవుతాయన్నారు.