అభివృద్ధి పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో పర్యటించి, బౌద్ధ స్థూపం వద్ద నిర్మిస్తున్న టూరిజం హోటల్, భక్త రామదాసు ఆడిటోరియం నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేసి, అధికారులకు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బౌద్ధ స్థూపం వద్ద రూ. 1.36 కోట్ల అంచనాలతో టూరిజం హోటల్ నిర్మాణ పనులకుగాను, రూ. ఒక కోటి తో టెండర్లు ఆహ్వానించి పనులు చేపట్టినట్లు తెలిపారు. 6 గదులు, కిచెన్, రిసిప్షన్ హాల్ లతో నిర్మాణం చేస్తున్నట్లు ఆయన అన్నారు. ఎలివేషన్ ఒక హోటల్ లా కాక పర్యాటక కళ వచ్చేలా చేపట్టాలన్నారు.
అదనపు భాగాల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. ఏప్రిల్ నెలాఖరులోగా పనులు పూర్తి చేసి, అందుబాటులోకి తేవాలన్నారు. నిర్మాణం పూర్తయి, అందుబాటులోకి వచ్చేలోగా, నిర్వహణ విషయమై ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. శ్రీ భక్త రామదాసు ఆడిటోరియం నిర్మాణ పనులు రూ. 1.40 కోట్లతో చేపట్టినట్లు ఆయన అన్నారు.
నిర్మాణ పనులు ఏప్రిల్ నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. కాంపౌండ్ వాల్ సీఆర్ఎస్ లో చేపట్టాలని, అప్పుడే చాలా కాలం పాటు ఉంటుందని ఆయన తెలిపారు. ప్రవేశం ద్వారం వద్ద ఆర్చ్ నిర్మాణం ఆకర్షణీయంగా ఉండాలన్నారు. ధ్యాన మందిరం ప్రక్కన ఉత్సవాల నిర్వహణకు డయాస్ ఎదురుగా కూలింగ్ టైల్స్ తో ఫ్లోరింగ్ చేపట్టాలని ఆయన అన్నారు.