ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటమే సుందరయ్యకు ఘన నివాళి అని cpm రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ అన్నారు. స్థానిక సుందరయ్య భవనంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వరరావు అధ్యక్షతన దక్షిణ భారత కమ్యునిస్ట్ ఉద్యమ నిర్మాత,పేదల పెన్నిధి పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతి జరిగింది.
మొదట సుందరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జోహార్లు అర్పించారు. అనంతరం జరిగిన సభలో పి.సుదర్శన్ మాట్లాడుతూ వర్గరహిత సమాజం సాధించటం అంత సులభమైన పని కాదని, అనేక ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. పార్టీ విధానం పట్ల వినయ విధేయతలు, నిరాడంబర జీవితం, ఎల్లప్పుడూ కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండటం వలన సుందరయ్య అత్యుత్తమ కమ్యూనిస్టు నాయకుడయ్యాడని అన్నారు.
ప్రజల మనిషిగా, ప్రజల కోసం చివరి వరకూ జీవించి ప్రజా పోరాటాలకు ప్రాధాన్యతనివ్వడంతోపాటు, సామాజిక పోరాటాలకు, సేవా కార్యక్రమాలకు కూడ అంతే ప్రాధాన్యతను సుందరయ్య ఇచ్చాడని అన్నారు. శ్రమను గౌరవించే సమాజం ఏర్పాటుకు అవిరళ కృషి చేసారని, స్త్రీలను కించపర్చడం, కులాధిక్యత భావాలను ఉపయోగించుకొని దళితులను, బలహీనవర్గాలను పీడిరచే చర్యలకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారన్నారు.
ఎమర్జెన్సీ సమయంలో పార్టీని, కార్యకర్తలను కాపాడుకోవటంలో వివిధ ఎన్నికల సందర్భంగా వచ్చిన ప్రతికూల ఫలితాలలో సైతం కార్యకర్తలను నిలబెట్టడంలో సుందరయ్య కీలకపాత్ర పోషించారన్నారు. మార్క్సిజం పట్ల ఎంచుకున్న లక్ష్యం పట్ల సుందరయ్య స్పష్టతతో వుండి ఉద్యమాన్ని నిర్మాణం చేశారన్నారు.
పార్టీని, ప్రజా సంస్థలను, సంఘాలను పోరాట కార్యక్రమాలతో పాటు, ప్రజా సంక్షేమం, సేవా కార్యక్రమాలు చేయాలని, సుందరయ్య చూపిన బాటలో పయనం చేయాలని కోరారు. ప్రస్తుతం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్మగమని, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని అట్టి విధానాలపై పోరాటమే పుచ్చలపల్లి సుందరయ్య కు ఇచ్చే ఘన నివాళి అని అన్నారు.
నిత్యవసరాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, అదే పద్ధతిలో ప్రజల జీవన ఆర్థిక ప్రమాణాలు పెరగడం లేదని, పరువు ఆత్మ హత్యలు ఇటీవల పెరిగాయని, దేశంలో నేరాలు, ఘోరాలు పెరిగాయని మోడీ ప్రభుత్వం వీటిపై దృష్టి సారించకుండా, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనారిటీల సంక్షేమానికి ఏర్పాటు చేసుకున్న ఉద్యోగాల రిజర్వేషన్ ఎత్తి వేసే దానికి కుట్ర చేస్తుందని ప్రైవేటీకరణ జరిగితే రిజర్వేషన్ లు పోయే ప్రమాదం వుందని ఆవేదన వ్యక్తంచేశారు.
పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో పాలిస్తున్న కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వీఆర్ఏ లను, జూనియర్ పంచాయతీ కార్యదర్శులను సమ్మె బాట పట్టించి సమ్మె లు విరమించకుంటే ఉద్యోగాల నుండి తొలగిస్తామని అహంకార పూరిత జీఓ లు ఇచ్చి భయ బ్రాంతులకు గురి చేసి దొరల పాలనకు అద్దం పట్టేలా వ్యవహరించారని, గ్రామీణ ప్రాంతాల మహిళలకు సమాజ అవగాహన కల్పిస్తూ డ్వాక్రా సంఘాల
ఏర్పాటు కు కృషి చేసిన క్షేత్రస్థాయి ఉద్యోగులైన విఓఏ లు గత నెల రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకున్న పాపాన పోవడం లేదని అన్నారు. కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మారుస్తూ దళితులపైన, మైనార్టీలపైన దాడులు చేస్తున్నదని అన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజూ పెరుగుతున్నా వాటిని అదుపు చేయటంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.
పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరిగే ఆందోళనలు, నిరసన కార్యక్రమాల్లో ప్రజలంతా పాల్గొని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలని కోరారు. రాబోయే కాలంలో ప్రజా సమస్యలపై ఉద్యమాలను నిర్మించటమే మనం సుందరయ్యకిచ్చే ఘన నివాళి అన్నారు.