ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటనలో భాగంగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న కేంద్ర ప్రాజెక్టుల వివరాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుత పర్యటనలో ఈ నెల 12 ఉదయం ప్రధాని మోదీ మొత్తం అయిదు శంకుస్థాపనలు, రెండు ప్రారంభోత్సవాలూ చేస్తారు. ఇందులో దశాబ్దాలుగా విశాఖ మత్స్యకారులు ఎదురు చూస్తున్న ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ, విస్తరణ ప్రాజెక్టు మొదటిది. 152 కోట్ల వ్యయంతో అధునాతన ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరుగనున్నది.
ఆంధ్రప్రదేశ్ సెక్షన్ లో రాయపూర్-విశాఖల మధ్య 3778 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆరు లైన్ల గ్రీన్ ఫీల్డ్ ఎకనమిక్ క్యారిడారుకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్ వరకూ 566 కోట్లతో నిర్మించనున్న డెడికేటెడ్ పోర్టు రోడ్డు నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేస్తారు. 460 కోట్లతో తలపెట్టిన విశాఖ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ నిర్మాణాలకు మోదీజీ శంకుస్థాపన చేస్తారు. శ్రీకాకుళం నుంచి ఒడిసాలోని ఆంగుల్ పట్టణం వరకూ గ్యాస్ అధారిటీ 2658 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 321 కిలో మీటర్ల సహజవాయు సరఫరా పైపు లైనుకు ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుంది. ఇక ప్రధాని ప్రారంభించనున్న రెండు ప్రాజెక్టులలో మొదటిది 211 కోట్లతో తపట్నం- నరసన్నపేటలను కలుపుతూ నిర్మించిన నూతన జాతీయ రహదారి. 2917 కోట్లతో ఓఎన్జీసీ ఈస్టర్న్ ఆఫ్ షోర్లో అభివృద్ధి చేసిన యూ-ఫీల్డ్ ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేస్తారు.