మహబూబ్ జిల్లా మిడ్జిల్ మండలం బోయిన్ పల్లిలో భారీ చోరీ జరిగింది. శుక్రవారం రాత్రి పెళ్లి జరగాల్సిన ఇంట్లో అందరూ గాఢ నిద్రలో ఉండగా సుమారు 200 వందల తులాల బంగారు ఆభరణాలు, 6లక్షల నగదు అపహరణకు గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. వివరాల్లోకి వెళితే..
బోయిన్ పల్లి గ్రామానికి చెందిన ఇంద్రారెడ్డి తన కుమారుని వివాహం నిశ్చయమైంది. వివాహ ఏర్పాట్లలో వారందరూ ఉన్నారు. వివాహానికి ముందే సిద్ధం చేసుకున్న బ్యాంకులో దాచిన బంగారం, కుటుంబసభ్యులు, బంధువుల వద్ద ఉన్నది మొత్తం కలిపి 200 తులాల బంగారం, 6 లక్షల నగదును బీరువాలో దాచారు. ఇంద్రారెడ్డి వ్యవసాయంతోపాటు ఇతర వ్యాపారాలు చేస్తుంటాడు. అతని చిన్న కుమారుడు తిలక్రెడ్డి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 23న తిలక్రెడ్డి వివాహం నిశ్చయించారు. ఈ నేపథ్యంలోనే బంగారం, డబ్బు, నగలు ఆయా విలువైన వస్తువులను ముందే సిద్ధం చేసుకున్నారు. కాగా ఇంద్రారెడ్డి సోదరుడు పక్కనే ఉంటాడు. ఆయన ఇంటికి మరమ్మతులు చేపడుతున్న నేపథ్యంలో ఆయన వద్ద ఉన్న విలువైన ఆభరణాలను కూడా ఇంద్రారెడ్డి ఇంట్లోనే దాచాడు.
కాగా శుక్రవారం రాత్రి పనులు ముగించుకొని అందరూ నిద్దుర పోయారు. గాఢ నిద్రలో ఉండగా చోరీ జరిగిందని ఉదయాన్నే లేచి చూసే సరికి చోరీ జరిగిన విషయాన్నికుటుంబ సభ్యులు గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని చోరీ జరిగిన విషయంపై ఇంద్రారెడ్డి కుటుంబసభ్యులను ప్రశ్నించారు. వీరంతా గాఢ నిద్రలో ఉండగా ముగ్గురు దొంగలు ఇంట్లోకి చొరబడినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇంకా పోలీసులు నిర్ధారణకు రాలేదు. మిడ్జిల్ ఎస్ఐ సురేష్బాబు కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బ్రందాలను రంగంలోకి దింపారు.