జిల్లాలో ఓటరు జాబితాను ఎలాంటి పొరపాట్లు లేకుండా తయారు చేయాలని, ఎన్నికల కమిషన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. స్థానిక డిపిఆర్సీ భవన సమావేశ మందిరంలో బిఎల్ఓ లకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్ హాజరై, బిఎల్ఓ లకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటరు జాబితాలో నూతన ఓటరు వివరాలు నమోదు చేసేందుకు అనుసరిస్తున్న విధివిధానాల పట్ల అవగాహన కల్గివుండాలన్నారు. బిఎల్ఓ యాప్ పై ప్రతి బిఎల్ఓ కి అవగాహన ఉండాలన్నారు. నూతన ఓటరు నమోదు చేసుకున్న దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి స్థానికులకు, 18 సంవత్సరాలు నిండిన అర్హులకు మాత్రమే జాబితాలో చోటు కల్పించాలని కలెక్టర్ సూచించారు.
ఆన్ లైన్ లో వచ్చే దరఖాస్తులను సైతం క్షేత్ర స్థాయిలో బూత్ సాయి అధికారులు విచారించి జాబితాలో చోటు కల్పించాలని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్ర పరిధిలో తుది ఓటరు జాబితా ప్రచురణకు ముందు ఒకటికి రెండు సార్లు ఫోటోలు, పేర్లు, ఇతర వివరాలను బూత్ స్థాయి అధికారులు సరిచూసుకోవాలని, పోలింగ్ కేంద్ర పరిధిలో ఉన్న వి.ఐ.పి, వి.వి.ఐ.పి., ప్రజా ప్రతినిధుల ఓటు వివరాలు చెక్ చేయాలని అన్నారు.
ఓటరు జాబితాలో పేర్ల తొలగింపు ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు జరగాలని, పోలింగ్ స్టేషన్ పరిధిలో వచ్చిన ఫారం-7 దరఖాస్తులను పరిశీలించి సదరు ఓటర్లు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారా లేదా అనే అంశాలను క్షుణ్ణంగా విచారించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో ప్రతివారం నమోదవుతున్న నూతన ఓటరు వివరాలు, తొలగిస్తున్న ఓటరు వివరాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేయాలని కలెక్టర్ అన్నారు. పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్న దివ్యాంగ ఓటర్ల వివరాలు చిరునామా తో మ్యాప్ చేసి పెట్టుకోవాలని, వారి కోసం వాహనాలు ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు ఉపయోగపడతాయని కలెక్టర్ తెలిపారు.
ఓటరు జాబితాలో డూప్లికేట్ ఓట్లు, లాజికల్ ఎర్రర్స్, డెమోగ్రాఫిక్ ఎర్రర్స్ పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలని ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో స్వల్ప మెజారిటీతో ఎన్నికల గెలుపోటములు మారిపోతున్నాయని, ప్రతి ఓటు చాలా కీలకంగా మారుతుందని కలెక్టర్ తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా స్వీప్ నోడల్ అధికారి కె. శ్రీరామ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఓటరు జాబితా, బిఎల్ఓ ల విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, కలెక్టరేట్ ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ రాంబాబు, అధికారులు, బిఎల్ఓ లు తదితరులు పాల్గొన్నారు.