ఏప్రిల్ 30న పాక్షిక సూర్య గ్రహణం, మే 15న సంపూర్ణ చంద్ర గ్రహణం జరగబోతున్నాయి. ఈ రెండు అద్భుత సంఘటన మధ్య ఈ ఆదివారం నాడు పుష్యమి నక్షత్రం రావడంతో దీన్ని రవి పుష్య యోగం అంటారు. ఇది ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న సంఘటన.
ఈ సందర్బంగా పరిహారాలను పాటించి శుభాలను పొందాలని భారత ప్రభుత్వ ఆమోదిత దృగ్గణిత పంచాంగకర్త, ప్రముఖ జ్యోతిష్య పండితులు దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ కోరారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2.58 లోపు పరిహారం పాటించాలని ఆయన తెలిపారు. పైన సూచించిన సమయంలో కనీసం 5 తెల్ల కాగితాలు తీసుకుని నాలుగు అంచులకు పసుపు రాయాలి.
అలాగే మధ్యలో ” శ్రీ ” రాసి దేవుడి దగ్గర పెట్టాలి. సాయంత్రం ఆ పేపర్లను భద్రపరుచు కోవాలి. మీరు ఏదైనా కార్యక్రమం చేయాలనుకున్నపుడు వాటిని ఉపయోగించవచ్చు అని ఆయన తెలిపారు. ఈ పేపర్లు వివాహ కార్యక్రమాలకు నిషిద్ధం అని ఆయన వెల్లడించారు. వివాహంకు సంబంధించిన కార్యాలు తప్ప మిగిలిన అన్ని కార్యక్రమాలకు ఇది మిక్కిలి శుభకరమని ఆయన స్పష్టం చేశారు.