33.2 C
Hyderabad
May 3, 2024 23: 50 PM
Slider ఆధ్యాత్మికం

తొలి ఏకాదశి విశిష్టత: ఆనందంతో పాటుగా ఆరోగ్యం

#toli ekadasi

హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి. ఈ పర్వదినంతోనే మన(హిందువుల) పండగలు ప్రారంభమౌతాయి. వరస క్రమంగా వినాయక చవితి,దసరా,దీపావళి, సంక్రాంతి పండగలు వస్తాయి.హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశికి విశేషమైన స్థానం ఉంది.దీనినే ‘శయన ఏకాదశి’ అని, హరి వాసరం,పేలాల పండగ’ అని కూడా పిలుస్తారు. జులై 20న, తొలి ఏకాదశి సందర్భంగా ఈ పండగ విశిష్టత,పూజా విధానం గురించి తెలుసుకుందాం.

ఒక ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి.వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘తొలి ఏకాదశిగా’గా పిలుస్తారు.పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు శయనిస్తాడు.అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధినీ ఏకాదశి రోజున విష్ణుమూర్తి తిరిగి మేల్కొంటాడు.

ఈ నాలుగు నెలలను చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు.తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు.ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాళ లోకంలో బలి చక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణగాథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది.

పూజకు పూజ,ఆరోగ్యానికి ఆరోగ్యం

ఉత్తరాయణంలో కంటే దక్షిణాయనంలో పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవించే కాలం కూడా ఇదే.కనుక ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణా నియమాలు ఎక్కువగా ఆచరించాలి.అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు,పూజలు, నోములు ఆచరించాలని నిర్దేశించారు. అంటే తొలి ఏకాదశి ఉపవాస దీక్ష ఆరోగ్య పరంగానూ మానవాళికి మేలు కలుగ చేస్తుందన్నమాట.

కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మ వరంతో దేవతలను, ఋషులను హింసించాడని మరో గాథ ప్రాచుర్యంలో ఉంది.ఆ రాక్షసుడితో శ్రీమహావిష్ణువు వెయ్యేళ్లు పోరాడి, అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి,ఆ రాక్షసుణ్ని అంతం చేసిందట.అందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తాను విష్ణుప్రియగా లోకం చేత పూజలు అందుకోవాలని కోరుకుందట.నాటి నుంచి ఆమె ‘ఏకాదశి’ తిథిగా వ్యవహారంలోకి వచ్చింది.నాటి నుంచి సాధువులు,భక్తులు ‘ఏకాదశి’ వ్రతం ఆచరించి విష్ణు సాయుజ్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి.అంబరీషుడు, మాంధాత, తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లు ఋషులు చెబుతారు.

ఏకాదశి పర్వదినాన ఏం చేయాలి

ఏకాదశి పర్వదినం రోజున ఉపవాసం ఉండాలి.ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి.ఈ సమయంలో విష్ణుసహస్రనామ పారాయణ, వష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం లాంటివి చేయాలి.మరుసటి రోజైన ద్వాదశి నాడు సమీపంలోని దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి.తొలి ఏకాదశి రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని చెబుతారు.

తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెబుతారు.పేలాలు పితృ దేవతలకు ఎంతో ఇష్టమైనవి. అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండగ రోజున గుర్తు చేసుకోవడం కూడా మన బాధ్యత.

వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది.అందువల్ల ఈ రోజున ఆలయాల్లో, ఇళ్ళలో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తోంది.

బాచిమంచి చంద్రశేఖర్, సత్యంన్యూస్.నెట్

Related posts

ఈనెల 25న రానున్న లవ్ & సస్పెన్స్ థ్రిల్లర్ నేనెవరు

Satyam NEWS

చినజియర్ ఆశీస్సుల కోసం వచ్చిన మధ్యప్రదేశ్ మాజీ సిఎం

Satyam NEWS

కేంద్ర బ‌డ్జెట్ ను నిర‌సిస్తూ….ఈ నెల 10 న విజ‌య‌వాడ‌లో సద‌స్సు..!

Satyam NEWS

Leave a Comment