సింగరేణి బొగ్గు గని జీవితాల నేపథ్యాలు, తెలంగాణ యాసతో నేచురల్ స్టార్ నాని, మహానటి కీర్తి సురేష్ నటించిన ‘ దసరా ‘ చిత్రం శ్రీరామ నవమి నాడు విడుదలై హిట్ టాక్ తో మంచి రెస్పాన్స్ సొంత చేసుకోగా, కరీంనగర్ లో విజయోత్సవ సభ నిర్వహించాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. రేపు కరీంనగర్ లోని స్థానిక ఎస్సారార్ డిగ్రీ కళాశాలలో బుదవారం సాయంత్రం నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.
ఈ విజయోత్సవ సభకు సంబంధించిన పోస్టర్ ను రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మంగళవారం మంత్రి మీ సేవ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… తెలంగాణ కుటుంబ నేపథ్యం, బంధాలు అనుబంధాల గురించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల కు చెందిన వేణు నిర్మించిన బలగం సినిమా విజయవంతం కాగా కరీంనగర్ లోనే విజయోత్సవ సభ నిర్వహించారని, సింగరేణి బొగ్గు గని జీవితాల నేపథ్యంతో తీసిన దసరా సినిమా విజయవంతం అవడం ఈ సినిమా విజయోత్సవ సభ కరీంనగర్ లో జరపడం అభినందనీయం అని అన్నారు.
హైదరాబాద్ తర్వాత రెండవ గొప్ప నగరంగా కరీంనగర్ ను తీర్చి దిద్దుతున్నామని, అందుకే సినిమా విజయోత్సవ సభలను కరీంనగర్ లో జరుపుకోవాలని కోరుకుంటున్నరని అన్నారు. రానున్న రోజుల్లో కరీంనగర్ టూరిజం స్పాట్ గా మారనుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, నాయకులు మెచినేని అశోక్ రావు, రాజేశ్వర రావు, కర్ర సూర్య శేఖర్, శ్రేయాస్ మీడియా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.