ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచార శాఖ తరపున విడుదల చేసిన అక్రిడిటేషన్ల జీవోలో పలు అంశాలలో మార్పులు కోరుతూ, ముఖ్యంగా ఈ జీవోలో అతి పెద్దదైన ఏపీయూడబ్ల్యూజే వంటి పాత్రికేయ సంఘానికి ప్రాతినిధ్యం లేకుండా చేయడాన్ని నిరసిస్తూ విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారికి సంఘ నాయకులు వినతిపత్రం అందజేశారు. పూర్తిస్ధాయి కాలపరిమితితో అక్రిడిటేషన్లు అందజేయాలని, చిన్న పత్రికలకు ప్రతి మండలంలో వంద పత్రిక సర్క్యులేషన్ ఉండాలన్న నిబంధనను తొలగించాలని, అదేవిధంగా ప్రస్తుత పరిస్ధితులలో కొత్త కమిటీలు ఏర్పాటు ఆలస్యం అవుతుందని అందువలన జూన్ వరకు అక్రిడిటేషన్ల గడుపు పొడిగించాలని వినతి పత్రంలో కోరారు.
కొత్త జీవోలో అసంబద్ధ నిబంధనలను తొలగించి ఏపీ ఫైబర్లో టెలికాస్ట్ అవుతున్న ఛానెళ్ల విలేకరులకు, నిబంధనల మేరకు రిజిస్టర్ అయిన ఎలక్ట్రానిక్ మీడియాను కూడా గుర్తించి అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని ఈ వినతి పత్రంలో కోరారు. సంఘ సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దిమిలి అచ్యుతరావు, రాష్ట్ర కార్యదర్శి శివప్రసాద్, జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎమ్మెస్సెన్ రాజు, జిల్లా కార్యదర్శి పంచాది అప్పారావు, సీనియర్ నాయకులు ఎలిశెట్టి సురేష్, టి. రాధాకృష్ణ, మహాపాత్రో, వై. సుబ్బయ్య పంతులు, చక్రవర్తి, భరత్ , గొట్టాపు త్రినాధ్, నాగరాజు, రవి, శర్మ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ వినతిపత్రాన్ని ప్రభుత్వానికి పంపుతామని కలెక్టర్ సూర్యకుమారి తెలిపారు.
విజయనగరం జిల్లాలోని ప్రైవేటు స్కూళ్లు, కళాశాలల్లో పాత్రికేయులు పిల్లలకు ఫీజు రాయితీ సౌకర్యం కల్పించేందుకు కలెక్టర్ ఎ. సూర్యకుమారి హామీ ఇచ్చారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా శాఖ తరుపున ఈ మేరకు ప్రత్యేక వినతి పత్రాన్ని సమర్పించగా కలెక్టర్ స్పందించారు. జిల్లాలో పాత్రికేయుల పిల్లల వివరాలతో కూడిన జాబితాను అందజేస్తే సంబంధిత ప్రైవేటు యాజమాన్యాలతో మాట్లాడి గతంలో ఇచ్చినట్లే 50 శాతం ఫీజు రాయితీని కల్పించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఈమేరకు తగు జాబితా రూపకల్పన చేస్తామని యూనియన్ నాయకులు తెలిపారు. జిల్లాలో ఇటువంటి ఫీజు రాయితీ కావలసిన పాత్రికేయులు తమ పూర్తి వివరాలు, పిల్లల విద్యా వివరాలు, విద్యా సంస్ధల వివరాలను అందజేయడానికి గాను 9705346345 ( /శ్రీ గొట్టాపు త్రినాధరావు) 94941 65730 ( శ్రీ వై. సుబ్బయ్య పంతులు)తో సంప్రదించాలని సంఘ రాష్ట్ర కార్యదర్శి శివప్రసాద్, జిల్లా కార్యదర్శి పంచాది అప్పారావు కోరారు.