వినాయకచవితి ఉత్సవాల పై నిషేధం రాష్ట్రానికి అరిష్టమని భజరంగ్ దళ్, తెలంగాణ విశ్వహిందూ పరిషత్ స్పష్టం చేశాయి.
వినాయక చవితి మండపాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొదట ఎలాంటి ఆంక్షలు ఉండవని ప్రకటించి తర్వాత మాట మార్చిందని వారన్నారు. భక్తులు, కార్యకర్తలు అన్ని ఏర్పాటు చేసుకున్న తరువాత గొంతు మార్చి ఇంటిలోనే పూజా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులు ప్రకటించారని వారన్నారు.
జిల్లా పోలీసు అధికారులు ప్రతి చోటా ఉత్సవాల నిర్వాహకులను, మంటపదారులను, వేధింపులకు గురి చేస్తూ పలు ఆంక్షలు విధిస్తున్నారని ఇది అన్యాయమని వారు తెలిపారు. దీనికి నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో, మండలాల్లో, గ్రామాల్లో బస్తీల్లో, గల్లీ గల్లీ లో మూతికి నల్ల వస్త్రం కట్టుకొని, లేదా నల్ల బట్టలు వేసుకొని, నల్ల రిబ్బన్ లు భుజానికి కట్టుకొని, నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు.
వినాయక మండపం పెట్టాలి అనుకున్న వారు, వారి మండపం పెట్టే స్థలంలో కాని, ఆ వీధిలో కాని, ఈ నిరసన కార్యక్రమం నిర్వహించాలని విశ్వ హిందూ పరిషత్ కోరింది. ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రచారం చెయ్యాలని వారు కోరారు.