38.2 C
Hyderabad
May 2, 2024 22: 53 PM
Slider ప్రత్యేకం

త్రిబుల్ వన్ జీవో అమలుపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి

#PawanKalyan

ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ఉంటారు, వెళ్లిపోతారు. అయితే వారు వ్యవస్థలను బలోపేతం చేసి వెళ్లాలి. వ్యవస్థను తూట్లు పొడిచి వెళ్లిపోతే వచ్చే సమస్యలు చాలా ఉంటాయి. నాలాలు ఆక్రమించేసి కట్టేస్తుంటే మేం చూసుకొంటాములే అనే వదిలేస్తారు. వాటిపై నిర్మాణాలు వస్తే భారీ వర్షాలు, వరదలతో ఎన్నో ఇబ్బందులు వస్తాయి అని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ అన్నారు.

వాటర్ బాడీస్ ను పరిరక్షించే జీవో 111కు తూట్లు పొడిచే ప్రయత్నాల వల్లే భారీ వర్షాలు, వరదలు సంభవించినప్పుడు ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారని ఆయన అన్నారు. అర్బన్ ప్లానింగ్, జీవో 111 అమలు ఆవశ్యకత, అర్బన్ ప్లానింగ్ నిబంధనలు అమలులో నేతల జోక్యం తదితర అంశాలపై జనసేన సోషల్ మీడియాతో పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాలు పంచుకున్నారు.

ఆ విషయాలు ఇవి: నిబంధనల ఉల్లంఘనపై ప్రతిపక్షంలో ఉన్నపుడే బలంగా మాట్లాడతారు. హైదరాబాద్ నగరీకరణలో లోపాలు ఉన్నాయనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. 111 జీవో సక్రమంగా అమలు కావడం లేదు.

ఈ పరిస్థితులు మారాలంటే ఏం చేయాలి?

భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణకు చాలా ప్రాధాన్యత పెరుగుతుంది.  నదులు, చెరువులు, కుంటలను  ఆక్రమించి అమ్మేయడం చేశారు. ఇలా నదులు, చెరువులు అమ్మేసిన విధానాన్ని నిలువరించి అక్రమ కట్టడాలు తీసేస్తే చాలా బాగుండేది.  భారతదేశంలో అర్బన్ ప్లానింగ్ వ్యవస్థకు తూట్లు పొడవడం అనవాయితీగా మారింది.

నాలాలు, చెరువుల దురాక్రమణపై ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు మాట్లాడినంత బలంగా అధికార పక్షంలోకి రాగానే మాట్లాడలేకపోతున్నారు. సన్నాయినొక్కులు నొక్కుతారు.

అధికారంలోకి వచ్చాక పరిస్థితులు వేరుగా ఉంటాయేమో?

అధికారంలో లేం కాబట్టి తెలియదు. అందుకే మాట్లాడేటప్పుడు 360 డిగ్రీల కోణంలో ఆలోచించి మాట్లాడతాను. గతం నుంచి ఉన్న ప్రభుత్వాలు అర్బన్ ప్లానింగ్ కు తూట్లు పొడుస్తూ వచ్చాయి. గతంలో హైదరాబాద్ నగరంలో 700 నుంచి 800 వరకూ చెరువులు ఉండేవని చెబుతారు.

ఇప్పుడు 180 మాత్రమే ఉన్నాయి. అవి కూడా సైజు తగ్గిపోయి, కాలుష్యంతో దుర్గంధం వెదజల్లుతున్నాయి. గండిపేట చెరువు కూడా సైజ్ తగ్గిపోయింది. కాలుష్యంపై నిర్లక్ష్యంగా ఉంటూ పొల్యూషన్ యాక్టులను సరిగా అమలు చేయకపోవడం వల్లే ఈ దుస్థితి. ఇప్పటికైనా మేల్కొనాలి. నాలాలూ… ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌) పరిధిలో ఉన్న స్థలాలు ఆక్రమించేయడం, ఇళ్ల నిర్మాణం చేపట్టడం.. అనుమతులు ఇచ్చేయడం చేస్తున్నారు. మళ్ళీ వాటిని కొంత డబ్బు కట్టించేసుకొని క్రమబద్ధీకరణ చేస్తున్నారు.

తప్పు చేసేయవచ్చు… ఆ తరవాత డబ్బు కట్టేసి రెగ్యులరైజ్ చేయించుకోండి అనే ధోరణే ఇప్పటి పరిస్థితికి దారి తీసింది. ఇందుకు ఈ ప్రభుత్వాన్నే అనలేంగానీ గత ప్రభుత్వాల నుంచి తప్పులు జరుగుతున్నాయి. ఇప్పుడున్న టి.ఆర్.ఎస్. ప్రభుత్వానికి ఆ తప్పులను సరిచేసే బాధ్యత ఉంది.

ఈ విషయంలో ఎంత వరకూ సఫలీకృతులు అవుతారో తెలీదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేయాల్సింది జీవో 111 అమలుపై దృష్టిపెట్టాలి. లేకపోతే ఇవాళ జరిగిన నష్టం మరో 20 ఏళ్ల తర్వాత ఇబ్బంది ముబ్బడిగా జరుగుతుంది. ఎందుకంటే నగరం విస్తరించడం వేగంగా సాగుతోంది. ప్లాటులు వేసి, నిర్మాణాలు చేస్తున్నారు. జీవో 111 ప్రకారం ఎఫ్.టి.ఎల్. అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.

ఉదాహరణకు ఓ పది ఎకరాలు ప్లాట్ వేస్తున్నారు అనుకుందాం. ఎఫ్.టి.ఎల్. పరిధిలో ఆరు ఎకరాలు ఉంటే దాన్ని మినహాయించి, నాలుగు ఎకరాల్లో నిర్మాణాలు చేసుకోవాలి. అంటే నీటి ప్రవాహం భారీగా ఉండి.. ఫుల్ ట్యాంక్ లెవెల్ కి వస్తే నీళ్లు నిలబడే  మేర నిర్మాణం ఉండకూడదు. నీటి ప్రవాహానికి ఆటంకం ఉండకూడదు. అలా కాకుండా రో హౌసెస్ కట్టేసి, నిర్మాణాలు చేస్తే భారీ వర్షపాతం నమోదైతే ముంపు వస్తుంది.

ఇప్పుడు మణికొండలో అయినా మరో చోటైనా జరిగింది అదే. 

ఇప్పుడు జరిగిన డ్యామేజ్ ను చక్కదిద్దడంతోపాటు భవిష్యత్ లో ఇలాంటి విపత్కర పరిస్థితులు రాకుండా చూడాలంటే జీవో 111కి తూట్లు పొడవకుండా బలంగా అమలు చేయాలి. సిటీ ప్లానింగ్ లో అక్రమాలకు తావివ్వకూడదు అనేది ఒక కామన్ మినిమమ్ ప్రోగ్రాం కావాలి. అధికారులు కూడా టౌన్ ప్లానింగ్ విషయంలో చాలా స్పష్టతతో వ్యవహరించాలి. అక్రమ నిర్మాణాలను ఉపేక్షించకూడదు.

నివాసాల కోసం ఉద్దేశించిన ప్రాంతంలో కమర్షియల్ బిల్డింగులు కట్టకూడదని ఉంటుంది. కానీ కడతారు. అధికారులు వెళ్లి అడిగితే ఎంపీ తెలుసు, ఎమ్మెల్యే తెలుసు అంటుంటారు. ఫలానా నాయకుడు మా బంధువు అనో, మా మేనమామ అనో చెబుతారు. ఎవరినీ ఉపేక్షించకూడదు. ప్రతి ఒక్కరికి చట్టపరమైన నిబంధనలను సమానంగా వర్తించేలా చేయాలి… అది 50 చదరపు అడుగుల నిర్మాణం కావచ్చు ఐదు లక్షల చదరపు అడుగుల నిర్మాణం కావచ్చు. ముఖ్యంగా అధికారులు తమ నిర్ణయాలను భయపడకుండా బలంగా అమలు చేయాలి.

ఫలానా వారికోసమో, మరొకరి కోసమో తూట్లు పొడవకూడదు.

ప్రజా ప్రతినిధులు అక్రమాలను వెనకేసుకొని రాకూడదు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ఉంటారు,. వెళ్లిపోతారు. వ్యవస్థలను బలోపేతం చేసి వెళ్లాలి. వ్యవస్థను తూట్లు పొడిచి వెళ్లిపోతే వచ్చే సమస్య ఇది. నాలాలు ఆక్రమించేసి కట్టేస్తుంటే మేం చూసుకొంటాములే అనే వదిలేస్తారు.

రూ.కోట్లు పెట్టి కొన్న విల్లాలు కూడా ఇలాంటి విపత్తులు వస్తే మునిగిపోతాయి. అప్పుడెవరో ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగమో చేసిన తప్పులకు ఈ రోజు శిక్ష అనుభవిస్తున్నాం. ఇక్కడ నిబంధనల మేరకు నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం కుదరదు అని చెబితే ప్రత్యామ్నాయం వెతుక్కొంటారు.

బలమైన పౌర సమాజం అవసరం ఉంది. పొలిటికల్ వ్యవస్థతోపాటు అలాంటి పౌర సమాజం ఉంటే తప్ప ఇలాంటి దురాక్రమణలు ఆగవు.

Related posts

అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రజనీకాంత్

Satyam NEWS

గుర్తింపు ఇచ్చిన సమాజానికి తిరిగి ఇవ్వాలనే….

Satyam NEWS

భారీ వ‌ర్షాల‌పై విజయనగరం జిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తం

Satyam NEWS

Leave a Comment