తిరుమలలో అన్యమతస్థులు పని చేస్తున్నారని ధర్మప్రచార సేవకుడు రాధమనోహర్ దాస్ చెబుతుంటే ఆయన కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ అక్కడి సిబ్బంది తమ పని తాము చేసుకోకుండా అడ్డుపడుతున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం ఆరోపిస్తున్నది.
ఇటీవల రాధమనోహర్ దాస్ స్వామి తిరుమల లో అక్కడి సిబ్బందిని గోవిందా అంటూ నినాదాలు చేయమని అడిగారు. అందుకు అక్కడి సిబ్బంది స్పందించకుండా ఆయనను అక్కడ నుంచి వెళ్లిపోవాల్సిందిగా కోరారు. ఇదంతా వీడియోగా తీసి రాధ మనోహర్ దాస్ స్వామి సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఆయన ప్రవర్తించారని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటన విడుదల చేసింది.
తిరుమలలో కోవిడ్ నిబంధనల ను ఉల్లంఘిస్తూ ఎక్కువ మంది భక్తులను ఒక చోట గుమికూడేలా చేసిన రాధమనోహర్ దాస్ అనే వ్యక్తి చర్యలను టీటీడీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా సెక్యూరిటీ సిబ్బంది పట్ల నీచంగా మాట్లాడటం, వారిని అన్య మతస్తులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం తీవ్రమైన చర్యగా పరిగణిస్తున్నామని టీటీడీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దాస్ తిరుమలలో అధికారులను కించపరిచేలా, మతాల మధ్య చిచ్చు పెట్టి భక్తుల్లో అలజడి రేకెత్తించేలా వ్యవహరించారని టీటీడీ ఆరోపించింది.
ఇంతటితో ఆగకుండా సదరు వీడియోను, అవాస్తవ సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గతంలో కూడా అనేక సార్లు ఈయన ఇలాగే వ్యవహరించారు. ఆయన తిరుమలకు తిరుమలకు వచ్చినప్పుడల్లా ఉద్యోగులను కించపరచడం, భక్తులను ఇబ్బంది పెట్టడం లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. పవిత్ర పుణ్య క్షేత్రమైన తిరుమలలో ఆమోదయోగ్యం కాని భాష వాడుతున్న ఇలాంటి వారికి భక్తులు అడ్డు చెప్పాలని, ఇలాంటి వ్యక్తుల అవాస్తవ ఆరోపణలను భక్తులు విశ్వసించవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోందని ఆ ప్రకటనలో కోరారు.