తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేస్తున్న ఒక సీనియర్ జర్నలిస్టుపై TV9 మాజీ సీఈవో రవిప్రకాష్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఉద్దేశ్యపూర్వకంగా తనను కించపరుస్తూ ఎన్ టి వికి చెందిన ఎడిటర్ సుందరరామ శాస్త్రి ప్రచారం చేస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తనపై ఉన్న కేసులలో విచారణ జరుగుతుండగా తనకు శిక్ష ఖాయమని చెబుతూ ప్రచారం చేయడం నేరమని ఆయన తెలిపారు. తన ఫొటోను మార్ఫింగ్ చేసి, తాను కటకటాల వెనుక ఉన్నట్లు చూపుతూ సుందరరామ శాస్త్రి ప్రచారం చేశారని రవిప్రకాష్ ఆరోపించారు.
వాసిరెడ్డి శ్రీనివాస్ అనే సీనియర్ జర్నలిస్టు పేరుతో ఒక ఫేక్ ఐడిని సుందర రామ శాస్త్రి, మరి కొందరు క్రియేట్ చేశారని దాని నుంచి ఈ తప్పు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని రవి ప్రకాష్ తెలిపారు.
వాసిరెడ్డి శ్రీనివాస్ తెలుగు గేట్ వే పేరుతో వెబ్ సైట్ నిర్వహించే ఒక సీనియర్ జర్నలిస్టు కాగా ఆయన పేరుతో సుందరరామ శాస్త్రి మరికొందరు కలిసి ఫేక్ ఐడిని రూపొందించారని, ఆ ఫేక్ ఐడి ద్వారా తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని TV9 మాజీ సీఈవో రవిప్రకాష్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తాను వాసిరెడ్డి శ్రీనివాస్ ను ఈ విషయం పై వివరణ కోరానని, అయితే తాను అలాంటి వార్త ఏదీ రాయలేదని చెప్పారని TV9 మాజీ సీఈవో రవిప్రకాష్ తెలిపారు.
తన పేరుతో ఫేక్ ఎకౌంట్ క్రియేట్ అయినట్లు ఆయన కూడా గుర్తించారని రవిప్రకాష్ తన ఫిర్యాదులో వివరించారు. ఫేక్ ఐడి సృష్టించి తనపై దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.