వారిద్దరూ రాజ్యసభ సభ్యులు. ఒకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ మరొకరు బిజెపి. ఇద్దరూ ఒకరిపై ఒకరు పోరాటం ప్రారంభించారు. ఆ ఇద్దరి కథ ఇది: రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని, అతని అక్రమ సంస్థలు, మనీ లాండరింగ్ వ్యవహారాలు, అంతర్జాతీయంగా అతను చేసిన వ్యాపార కుంభకోణాల గురించి ఎంక్వయిరీ చెయ్యాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి భారత రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు.
సుజనా చౌదరి అవినీతిపై ఈడీ, సిబిఐ దర్యాప్తు చేయాలని కోరినట్లు విజయసాయి లేఖలో పేర్కొన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రాష్ట్రపతి ఈ లేఖపై స్పందించి హోం మంత్రిత్వ శాఖకు పంపారు. దీనిని రాష్ట్రపతి కార్యాలయం పంపినప్పటి తరువాత హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా ఈ నోట్ను అన్ని విభాగాలకు పంపించింది. దర్యాప్తు చెయ్యమని ప్రభుత్వం ఆదేశిస్తే, సుజన చౌదరి తీవ్ర ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది.
దీనిపై సుజనా చౌదరి తీవ్రంగా స్పందించారు. ఆ వివరాలు ఇవి: 16 నెలలు జైలులో ఊచలు లెక్కబెట్టిన విజయసాయిరెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తూ 26న రాష్ట్రపతికి లేఖ రాశారు. ఆ లేఖని రాష్ట్రపతి కార్యాలయం దాదాపు నెలన్నర తరువాత కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఫార్వార్డ్ చేసింది. దేశంలో ఏ పౌరుడైనా రాష్ట్రపతికి లేఖ రాసినా, అర్జీ పెట్టుకున్నా రాష్ట్రపతి కార్యాలయం సంబంధిత మంత్రిత్వ శాఖకు దాన్ని ఫార్వార్డ్ చేయడం రివాజు. అందులో భాగంగానే విజయసాయిరెడ్డి రాసిన ఉత్తరం కూడా హోం మంత్రిత్వ శాఖకు చేరింది.
నామీద ఏ విధమైన ఆరోపణలు గానీ, ఫిర్యాదులు గానీ, ఏ సంస్థ గానీ, ఏ వ్యక్తిగానీ ఇంతవరకు చేయలేదు. నా మీద ఎక్కడా, ఏ విధమైన కేసులు లేవు. నా జీవితం, నా బిజినెస్ కెరియర్, నా పొలిటికల్ కెరియర్ తెరిచిన పుస్తకాలు. రాష్ట్రపతికి రాసిన లేఖకు వచ్చిన ఎక్నాలెడ్జ్ మెంట్ ను పట్టుకుని నా ప్రతిష్టను దిగజార్చడానికి విజయసాయిరెడ్డి చేస్తున్న మరొక చిల్లర ప్రయత్నమే ఇది.
వారం వారం కోర్టు మెట్లెక్కుతూ, తుది తీర్పు కోసం, తీర్పుతో పడే శిక్ష కోసం బిక్కు బిక్కు మంటూ ఎదురుచూస్తున్న కన్ఫార్మ్డ్ క్రిమినల్ విజయసాయిరెడ్డి. ఇకనైనా ఆయన ఇలాంటి నేలబారు వ్యవహారాలు కట్టిపెట్టి రాష్ట్రానికి ప్రయోజనకారిగా వుండే అంశాలపై దృష్టి పెట్టడం మంచిది.