ఆకలిదప్పుల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఆరేళ్లలో అన్నపూర్ణగా మారిందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. 70 ఏళ్లు ప్రభుత్వాలు తెలంగాణ ను నిర్వీర్యం చేస్తే ఆరేళ్లలో స్వయం పాలనలో తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ది చెందిందని ఆయన తెలిపారు.
కొల్లాపూర్ నియోజకవర్గం సింగోటంలో 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి ఆయన నేడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి పాల్గొన్నారు. అదే విధంగా 220/33 కేవీ సబ్ స్టేషన్ లో కొల్లాపూర్ కరెంటు సరఫరాకు ప్రత్యేక ఫీడర్లు ప్రారంభించారు. అనంతరం సింగోటం రిజర్వాయర్ సమీపాన హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు.
అంబలి కేంద్రాలతో ఆకలి తీర్చుకున్న గ్రామాలలో ధాన్యపురాశులు దర్శనమిస్తున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి అన్నారు. కరెంటు రాని కాలం నుండి కరెంటు పోని స్థితి వరకు వచ్చాం. కరోనాతో ప్రపంచమే స్థంభించినా తెలంగాణలో సంక్షేమ పథకాలు ఆగలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ కరెంటు ప్రాధాన్యం గుర్తించి రూ.26 వేల కోట్లతో నూతన కరెంటు ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేశారని ఆయన అన్నారు.
కరెంటు, సాగునీరు సమృద్దిగా అందడంతో వ్యవసాయం పెరిగిందని ఆయన అన్నారు. పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏర్పాటయ్యాయి .. కరంటు లేక మూతపడ్డ పాత పరిశ్రమలు పున:ప్రారంభం అయ్యాయి అని మంత్రి తెలిపారు. రైతుబంధు, రైతుభీమా, కేసీఆర్ కిట్, కళ్యాణలక్ష్మి, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు వంటి పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమలుకావడం లేదని ఆయన అన్నారు.
మూడు నెలలలో సింగోటం నూతన సబ్ స్టేషన్ పూర్తి కావాలని ఆయన ఆదేశించారు. అదే విధంగా త్వరలో కొల్లాపూర్ లో మామిడి మార్కెట్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.