ఆసుపత్రిలో అడ్మిట్ అయిన వ్యక్తికి అందితే చికిత్స అందాలి లేకపోతే మరణించాడని వైద్యులు ప్రకటించాలి. కానీ అదేమిటో గానీ నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈనెల 27వ తేదీన అడ్మిట్ అయిన వ్యక్తి మూడు రోజుల్లో శవంగా మారాడు.
ఆసుపత్రిలో కాదు సుమా…. అదే ఆసుపత్రి ముందు ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఆ వ్యక్తి శవం కనిపించింది. నేడు ఈ ఘటన కొల్లాపూర్ లో సంచలనం కలిగించింది. మృతదేహం విషయాన్ని స్థానికులు స్థానిక సీఐ యాలాద్రి కి సమాచారం ఇచ్చారు .వెంటనే సీఐ పోలీసులను అక్కడికి పంపించారు.
ఎ ఎస్ ఐ, పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చనిపోయిన వ్యక్తి దోమల పేట గ్రామానికి చెందిన వాడు. అతని పేరు రాములు. అతనికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మృతుడి వయసు 50 సంవత్సరాలకు పైగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు.
మృతుడిని గుర్తించడానికి ఈగలపెంట ఎస్ఐకి సమాచారం అందించారు. అతని మృతదేహాన్ని మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో మున్సిపల్ వాహనంలో సిబ్బంది పోలీసులు, స్థానికుల సహాయంతో మార్చురీకి తరలించారు. ఆసుపత్రి సూపరిటెండెంట్ ను వివరణ కోరగా అతను డిచర్జ్ కాలేదన్నారు. ఉదయం బయటికి వెళ్లినట్లు చెబుతున్నారు. మృతిని బట్టలపై రక్తం మరకలు అయితే ఉన్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.