ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే… ఆ నిప్పుతో సిగరెట్ కాల్చుకోవడానికి మరొకడు వెళ్లాడని సామెత. పాపం ఏపి సిఐడి పోలీసు కష్టడీలో ఒక్క రోజు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు నడవలేని స్థితికి వచ్చారు.
ఆయనకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రితో బాటు రమేష్ ఆసుపత్రిలో కూడా వైద్య పరీక్షలు చేయాలని కోర్టు చెప్పినా సిఐడి పోలీసులు మాత్రం ఆ పని చేయలేదు.
ఒక్క గుంటూరు ఆసుపత్రిలో చికిత్స చేయించి జైలుకు తరలించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆయనకు ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈ వైద్య పరీక్షల సారాంశాన్ని సీల్డు కవర్ లో వైద్యులు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ద్వారా సుప్రీంకోర్టుకు పంపారు.
ఆ రిపోర్టులపై పలు రకాల వూహాగానాలు ఉన్నాయి. రఘురామకృష్ణంరాజు కాలిగాయాలు పోలీసులు కొట్టినవేననే విషయం వైద్యులు ధృవీకరించారని కొందరు చెప్పుకుటుంటే మరి కొందరు అందుకు విరుద్ధంగా చెబుతున్నారు.
సీల్డు కవర్ లో ఏముందో ఎవరికి తెలీదు.
శుక్రవారంనాడు సుప్రీంకోర్టు వారు తెరిస్తే అసలు విషయం వెల్లడి అయ్యే అవకాశం ఉంటుంది. అప్పటి వరకూ ఉత్కంఠ తట్టుకోలేని చాలా మంది బెట్టింగులు పెడుతున్నట్లు చెబుతున్నారు.
ఎక్కడా అధికారికంగా ఈ విషయం వెల్లడి కాలేదు కానీ చాలా చోట్ల బెట్టింగులు జరుగుతున్నట్లు తెలిసింది.
కోడి పందాల విషయంలో ఎంతో చొరవ తీసుకునే రఘురామకృష్ణంరాజు ఇలా బెట్టింగ్ మెటీరియల్ తానే అవుతానని ఎప్పుడూ అనుకొని ఉండరు.