దళితబంధు యూనిట్లను సద్వినియోగం చేసుకుని, దళితులు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ మధిర నియోజకవర్గం బోనకల్ మండలంలోని కలకోట గ్రామంలో పర్యటించి దళితబంధు సర్వే తనిఖీ చేశారు. గ్రామంలోని బలుమూరి సామ్యూల్, తోటపల్లి మురళి, తోటపల్లి రత్నాకర్ ల ఇండ్లకు వెళ్లి వారితో ఇంటరాక్ట్ అయ్యారు. కుటుంబ సభ్యులు, కుటుంబ పరిస్థితి, ఏమి పనిచేస్తున్నది, ఏ యూనిట్ గురించి ఆలోచిస్తుంది, ఆ యూనిట్లో అనుభవం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, యూనిట్ల ఎంపికలో సరిగ్గా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు.
ప్రభుత్వం దళితులు ఆర్థికంగా ఎదిగి, తమ కాళ్ళ మీద తాము నిలబడడమే కాక, మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి చేరాలన్నారు. లబ్ధిదారులకు కావాల్సిన ధ్రువీకరణలు ప్రత్యేక మీ సేవ కేంద్రాలు ఏర్పాటుచేసి అందజేస్తామన్నారు. మనం ఏ వృత్తిలో వున్నాం, ఏ వృత్తిలో నైపుణ్యం ఉంది, ఏ యూనిట్ అయితే మన కుటుంబ సభ్యులే నిర్వహించుకోగల్గుతాం, ఏ యూనిట్లకు డిమాండ్ ఉంది అనే ఆలోచన చేయాలన్నారు. దళితబంధు పథక లక్ష్యం, యూనిట్ల జాబితాలపై కరపత్రాలు రూపొందించి అవగాహన కల్పించాలన్నారు. కాలనీల్లో, వీధుల్లో దళితబంధు యూనిట్లపై చర్చ జరగాలన్నారు.కలెక్టర్ పర్యటన సందర్భంగా ప్రత్యేక అధికారులు జెడ్పి సిఇఓ వి.వి.అప్పారావు, జిల్లా సంక్షేమ అధికారిణి సుమ, , అధికారులు, తదితరులు ఉన్నారు.