వెంకటగిరి పట్టణం మీదుగా వెళ్తున్న జాతీయ రహదారి-565 పై 2.450 కిలోమీటర్ల మేర సెంట్రల్ లైటింగ్ ను ఏర్పాటు చేసేందుకు నేషనల్ హైవే అథారిటీస్ టెండర్లు ఆహ్వానించింది. తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రత్యేక శ్రద్ద, కృషితో రూ.1,41 కోట్ల నిధులను వెంకటగిరి మునిసిపాలిటీ పరిధిలో గల ఈ జాతీయ రహదారిపై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు కేంద్ర రహదారుల మంత్రిత్వశాఖ అనుమతులు మంజూరు చేసింది.
ఇందులో భాగంగా కిమీ 480.690 నుండి కిమీ 483.140 వరకు “న్యూ మీడియన్ హైవే లైటింగ్” కోసం నిధులు మంజూరు చేస్తూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రీజినల్ ఆఫీసర్ పనులు చేపట్టేందుకు టెండర్లు ఆహ్వానించారు. ఇదివరకే వెంకటగిరి పట్టణంలో ఎంపీ మద్దిల గురుమూర్తి తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి కోటి రూపాయలు మంజూరు చేసి ఎల్ఈడి కాంతులు నింపిన విషయం విదితమే.
ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ స్థానిక నియోజకవర్గ ఇంచార్జి మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి సూచన మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో వెంకటగిరి మునిసిపాలిటీలో ఈ రహదారిపై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు పలు మార్లు కేంద్ర మంత్రి గడ్కరీకి విన్నవించామన్నారు.
సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుతో పట్టణ సుందరీకరణ తోపాటుగా రోడ్డు ప్రమాదాల నివారించవచ్చని ఎంపీ గురుమూర్తి తెలియజేసారు. ప్రస్తుతం ఈ పనులు చేపట్టేందుకు సహకరించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఎంపీ గురుమూర్తి ధన్యవాదాలు తెలియజేసారు.