కళియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వరుడు కరీంనగర్ గడ్డకు తరలిరానున్నారు. నగరం నడిమద్యలో టీటీడీ గుడి కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ పదెకరాల భూమిని కేటాయించారు. ఈ రోజు దానికి సంబందించిన అనుమతి పత్రాన్ని మంత్రి గంగుల కమలాకర్ తో పాటు టీటీడీ హైదరాబాద్ లోకల్ అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ జి.వి. బాస్కర్ రావులకు అసెంబ్లీలో అందజేసారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ యాదాద్రిని అధ్బుతంగా తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్, తిరుమల శ్రీవారి ఆలయ నిర్మాణానికి కరీంనగర్ పట్టణం మధ్యలో పదెకరాల్ని కేటాయించడం చాలా ఆనందంగా ఉందన్నారు.
భక్తులకు అత్యంత ప్రీతిపాత్రుడైన శ్రీనివాసుని గుడిని సీఎం కేసీఆర్ గారి సంకల్పంతో ఏడాదిన్నరలోనే భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. తిరుమలకు ఏమాత్రం తీసిపోకుండా యాదాద్రి వైభవం ప్రతిఫలించేలా అధ్బుతమైన వేంకటేశ్వర స్వామి గుడి నిర్మాణాన్ని చేపడతామన్నారు.
ఆ శ్రీనివాసుని కృపతో ప్లానింగ్ బోర్డ్ వైస్ ఛైర్మన్ వినోద్ కుమార్, నమస్తే తెలంగాణ సీఎండీ దీవకోండ దామెదర్ రావు, టీటీడీ తెలంగాణ లోకల్ అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ గుండవరం వెంకట భాస్కర్ రావు కృషితో మొన్నటి టీటీడీ బోర్డు సమావేశంలో కరీంనగర్ వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణానికి టీటీడీ బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహార్ రెడ్డి మిగతా బోర్డు సభ్యుల ఆమోదం లభించిందన్నారు.
ఆలయాల పునరుద్దరణ, దూపదీప నైవేద్యాలు, నిత్య కైంకర్యాల నిర్వహణతో సీఎం కేసీఆర్ సారథ్యంతో గుడులకు పూర్వవైభవం వస్తుందన్నారు. ధర్మాన్ని ప్రేమిస్తూ భక్తులకు విశేష రీతిలో సౌకర్యాలతో పాటు దేవదేవుని అనుగ్రహం లభించేలా ఆలయాల నిర్వహణ ప్రభుత్వం చేస్తుందన్నారు.
సంవత్సరంన్నరలో పూర్తయ్యే కరీంనగర్ శ్రీనివాసుని ఆలయంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని భక్తులకు ఆ భగవంతుడు మరింత చేరువవుతాడన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఈ కార్యక్రమంలో మంత్రి గంగులతో పాటు టీటీడీ తెలంగాణ లోకల్ అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ గుండవరం వెంకట బాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.