చైనా తన కుక్క బుద్ధిని పోనిచ్చుకోవడం లేదు. భారత సైనికాధికారులతో చర్చలు జరుపుతూనే మరో వైపు భారత భూభాగంలోకి చొచ్చుకుని వస్తూనే ఉన్నది.
రెండు రోజుల కిందట చైనా తూర్పు లద్దాక్ లోకి చొచ్చుకువచ్చినట్లు భారత భద్రతాదళాలు గుర్తించాయి. సైనికాధికారుల స్థాయి చర్చలలో కుదిరిన ఒప్పందానికి భిన్నంగా చైనా ప్రవర్తించినట్లు భారత్ ఆక్షేపించింది.
యథాతధ స్థితిని కొనసాగించేందుకు కుదిరిన ఒప్పందానికి చైనా తూట్లు పొడిచింది. పాంగాంగ్ టిఎస్ఓ సరస్సు వద్ద చైనా సైనికుల కదలికలు గుర్తించిన భారత భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి.
చైనా కదలికలు గుర్తించినందుకు సైన్యాన్ని అప్రమత్తం చేసినట్లు అధికారులు వెల్లడించారు. చర్చల ద్వారా సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవడానికి భారత్ ప్రాధాన్యతనిస్తుందని అయితే ఈ విధమైన ఒప్పంద ఉల్లంఘనలను సహించేది లేదని భారత్ వెల్లడించింది.
సరిహద్దులను కాపాడుకోవడానికి తాము సన్నద్ధంగా ఉన్నామని భారత సైన్యం ప్రకటించింది. బ్రిగేడ్ కమాండర్ స్థాయి లో చౌషల్ వద్ద ఫ్లాగ్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.