ప్రజలు అన్ని పండుగలను ఘనంగా జరుపుకోవాలి అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్ష అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. గణేశ్ నిమజ్జనం వేడుకల్లో భాగంగా ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని పలు ప్రాంతాలలో ప్రతిష్టించిన గణేష్ విగ్రహాలను అధికారిక లాంఛనాలతో చేపట్టిన సార్వత్రిక నిమజ్జనంను త్రీ టౌన్ లోని గాంధీ చౌక్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన వేదిక వద్ద మంత్రి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలకు, మతాలను గౌరవిస్తూ ఆయా పండుగలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఅర్ అన్న విధంగా తెలంగాణ రాష్ట్రం గంగ జమున తేహాజీబ్ లా అన్ని మతాలు అన్నదమ్ముల వలె కలిసి ఉంటారని అన్నారు. ఖమ్మం ఎంతో ప్రశాంతకరమైన వాతావరణంకు మారు పేరని ఇక్కడ ప్రజలంతా ఒక్కటే అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మట్టి గణపతి విగ్రహాలను ప్రోత్సహించిన స్తంభాద్రి ఉత్సవ సమితి నిర్వాహకులను అభినందించారు. అనంతరం నిమజ్జన తీరును నిమజ్జన ఏర్పాట్లును పర్యవేక్షించారు.
ఎక్కడ అపశృతులు లేకుండా జాగ్రత్తలు వహించాలని నిర్వాహకులకు సూచించారు. ఇప్పటికే అన్ని నిమజ్జన కేంద్రాలలో ఏర్పాట్లు చేశామన్నారు. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని, వారికి అభినందనలు తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుడిని ప్రోత్సహించి, పూజించాలనే ఆకాంక్షతోనే స్థంబాద్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక మండపాలకు పువ్వాడ ఫౌండేషన్ తరుపున విద్యుత్ చార్జీలు, పోలీస్ పర్మిషన్ ల నిమిత్తం రూ.4 లక్షలు చెల్లించామన్నారు.
వచ్చే ఏడాది నుండి పూర్తి స్థాయిలో మట్టి వినాయకుడినే ప్రతిష్టించి ఆరాధించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి అన్ని పండుగలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారని అన్నారు. వేలాది మంది పాల్గొనే గణేష్ శోభాయాత్రకు దేశంలోనే ఎంతో ప్రత్యేకత ఉందని మంత్రి అన్నారు. కాల్వఒడ్డులో వివిధ సంస్ధల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత త్రాగునీరు, మజ్జిగ పంపిణీ కేంద్రాలను ప్రారంభించి ఆయా ఏర్పాటు చేసిన వారికి అభినందనలు తెలియజేశారు.