ఉక్రెయిన్పై నిర్విరామంగా యుద్ధం చేస్తున్న రష్యా పై మరో పిడుగు పడింది. వీసా, మాస్టర్ కార్డులు తమ కార్యకలాపాలను రష్యాలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ నిర్ణయం రష్యా ఆర్ధిక వ్యవస్థ పై పెను ప్రభావం చూపుతుంది. రష్యాపై ఇప్పటికే పలు దేశాలు ఆంక్షలు విధించాయి.
ఈ దశలో విసా, మాస్టర్ కార్డులు కూడా తమ కార్యకలాపాలను నిలిపివేయడంతో రష్యా ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలుతుంది. పొరుగు దేశమైన ఉక్రెయిన్పై రష్యా గత పది రోజులుగా యుద్ధం చేస్తున్నది. అగ్రరాజ్యమైన అమెరికా, యూరోప్ దేశాలు తన వద్దకు వచ్చే సాహసం చేయవని, నాటో దళాలు కూడా కల్పించుకోవని, వారంతా యుద్ధాలతో అలసి పోయారని గ్రహించిన తర్వాతే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగారు.
నాలుగు రోజుల్లో ఉక్రెయిన్ తమ పాదాక్రాంతం అవుతుందని ఆశించారు. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ధైర్యంతో పోరాడుతుండటంతో రోజులు గడిచినా ఉక్రెయిన్ను రష్యా సొంతం చేసుకోలేకపోయింది. పైగా రష్యా చర్యలను అన్ని దేశాలూ తప్పుపడుతున్నాయి. ఏ దేశం కూడా వారికి మద్దతు పలకడం లేదు. ఈ క్రమంలో రష్యా ఏకాకిగా మిగిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
అమెరికా, ఇతర యూరోప్ దేశాలు ప్రకటించిన ఆర్థిక ఆంక్షలతో ఇప్పటికే పలు సవాళ్లను రష్యా ఎదుర్కొంటోంది. ఈ ఆంక్షలు రష్యా ఆర్థిక వ్యవస్థను పతనం అంచుకు తీసుకెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి సంక్షోభాలనైనా ఎదుర్కొనేందుకు వీలుగా విదేశీ మారక ద్రవ్యాన్ని, బంగారాన్ని పెద్ద ఎత్తున రష్యా పోగు చేసుకుంది. 2014లో క్రిమియాను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఈ నిల్వలను విపరీతంగా పెంచుకుంది. అయితే ఆ నిల్వలన్నిటినీ విదేశీ బ్యాంకుల్లో దాచడంతో ఆర్థిక ఆంక్షల కారణంగా అవి అక్కరకు రాని పరిస్థితులు నెలకొన్నాయి.