తెలుగు రాష్ట్రాలకు పునర్ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చని ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 11న విశాఖపట్నం, 12న రామగుండం పర్యటిస్తున్న సందర్భంగా ఆ ప్రాంతాల్లో ప్రజలు బంద్ పాటించాలని, నల్ల జెండాలతో నిరసనలతో గుణపాఠం చెప్పాలని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ పిలుపునిచ్చారు. హైదరాబా ద్ మగ్ధుంభవన్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ సమితి సభ్యులు పశ్యపద్మ, ఈ.టి.నర్సింహాలతో కలిసి గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ రామగుండంకు వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు. ఎపి మోడీ పర్యటన సందర్భంగా విశాఖపట్నం బంద్ సన్నాహాలు జరుగుతన్నాయని, మోడీ నిరసనలు, అవమానంలోనే అడుగు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. మొదటి నుండి తాము బ్రిటీష్ కాలం నాటి గవర్నర్, రాష్ట్రపతి వ్యవస్థను వ్యతిరేకిస్తున్నామని, నాడు బ్రిటీష్ తాబేదారులను గవర్నర్లుగా నియమించేవారని గుర్తు చేశారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం బుద్దిలేకుండా ఈ వ్యవస్థను అమలు చేసిందని మండిపడ్డారు.
కేరళ, పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. కరోనా సమయంలో దేశంలోనే ఆదర్శంగా నిలిచిన కేరళ ప్రభుత్వాన్ని భ్రష్ఠుపట్టిన గవర్నర్ అడ్డుపడుతారా? అని మండిపడ్డారు. గవర్నర్ వ్యవస్థకు సంవత్సరానికి రూ.60 నుండి రూ.70 కోట్ల నష్టం జరుగుతోందన్నారు. బిజెపి ప్రతికూల రాష్ట్ర ప్రభుత్వాలపైన సిబిఐ, ఈడి, గవర్నర్ వ్యవస్థల ద్వారా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహారిస్తున్న గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని, గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ రీకాల్ చేసి, ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతిని నారాయణ విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రపతి, గవర్నర్ రెండు వ్యవస్థలూ దేశానికి నష్టమని, ఈరెండు వ్యవస్థలు బ్రిటీష్ కాలం నాటి బానిస వ్యవస్థలకు ప్రతిబింబిమని వ్యాఖ్యానించారు. తాము అంబేడ్కర్ రాజ్యాంగాన్ని చదవితే, గవర్నర్ తమిళి సై ఆర్ ఎస్ ఎస్ రాసిన రాజ్యాంగాన్ని చదువుకుని మాట్లాడుతున్నా రన్నారు. ప్రజాదర్భార్ కార్యక్రమాన్ని ప్రకటించిన సమయంలోనే గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ లక్ష్మణరేఖ దాటుతున్నారని తాము ఇది వరకే ప్రకటించిన విషయాన్ని నారాయణ గుర్తు చేశారు.