విశ్వజనని ఫౌండేషన్ ప్రధమ వార్షికోత్సవాన్ని హైదరాబాద్ ఆబీడ్స్ ప్రాంతంలోని బొగ్గులకుంట లో ఉన్న తెలంగాణ సారస్వత పరిషత్ డాక్టర్ సి.నారాయణ రెడ్డి కళావేదికలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన డాక్టర్ గుంటి పిచ్చయ్య బాలచంద్రుడు ఏకపాత్రాభినయం ప్రదర్శించారు. ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య ఈ కార్యక్రమం సాగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త డాక్టర్ గుంటి పిచ్చయ్య ప్రదర్శించిన పల్నాటి బాలచంద్రుడు ఏకపాత్రాభినయం అద్భుతంగా ఉందని ప్రశంసించారు.
నేటి తరం యువత ఇలాంటి పాత్రలు నేర్చుకొని ప్రదర్శించాలని, తెలుగు సాంస్కృతిక కార్యక్రమాల పట్ల అభిరుచి పెంచుకోవాలని తెలియజేశారు. సినీనటి ప్రస్తుత బుల్లితెర సీనియర్ నటి రాగి మాట్లాడుతూ డాక్టర్ గుంటి పిచ్చయ్య ప్రదర్శించిన అలనాటి జానపద పౌరాణిక తెలుగు చిత్రాలను గుర్తు చేసే విధంగా ఉన్నాయని కొనియాడారు. సాంస్కృతిక కార్యక్రమం అనంతరం డాక్టర్ గుంటి పిచ్చయ్య కు విశ్వజనని ఫౌండేషన్ ద్వారా జాతీయ కళాజ్యోతి అవార్డును ఇచ్చి ఘనంగా సన్మానించారు.
డాక్టర్ గుంటి పిచ్చయ్య కు ఈ అవార్డు రావడం పట్ల తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాల సమాఖ్య రాష్ట్ర, జిల్లా,నియోజకవర్గ కళాకారులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యాక్టర్ నవీన రెడ్డి తెలంగాణ మా సినిమా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సినీ యాక్టర్ ఏ కిరణ్ కుమార్,సృజన,డాక్టర్ అనిత రెడ్డి,విశ్వ జనని ఫౌండేషన్ అధ్యక్షుడు బ్రహ్మానందం,కవులు,కళాకారులు ఆధ్యాత్మికవేత్తలు,పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్