గ్రామీణ ప్రాంతాల్లో కష్టపడి పనిచేసే వారికి గతంలో కొన్ని రోగాలు దరిచేరేవు కావని, డయాబెటిస్ ని రిచ్ మాన్ డిసీజ్ గా గతంలో చెప్పేవారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి బీపీ, షుగర్ వ్యాధులు వస్తున్నాయని, క్యాన్సర్ మహమ్మారి కూడా సోకుతుందని, ఆర్థిక స్తోమతతో సంబంధం లేకుండా జబ్బులు వస్తున్నాయని దీనివల్ల ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.
వివేకానంద హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. అన్ని ఖర్చులను ప్లాన్ చేసుకుంటాము కానీ అనుకోని రోగాలు వచ్చినప్పుడు వైద్యం ఖర్చు ఒక్కసారిగా మీద పడుతుందని వాటిని భరించడం పేద, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారుతుందన్నారు.
కులం, మతం, అంతస్తులతో సంబంధం లేకుండా అనేక జబ్బులు ప్రాణాలు తీస్తున్నాయని, గుడిసెలో ఉండే వారికైనా.. బంగ్లాలో ఉన్న వారికైనా ప్రాణాలు కాపాడుకోవాలని ఆరాటం ఒకే విధంగా ఉంటుందన్నారు ఈటెల. ఇందుకోసం లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నామని, పేద కుటుంబాలు పెద్ద జబ్బులు వస్తే అంధకారంలో మునిగిపోతున్నాయని గుర్తు చేశారు.
క్యాన్సర్ లాంటి జబ్బులకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని, ఇలాంటి జబ్బుల బారిన పడిన వారిని ఆదుకునేందుకు అనేక ప్రైవేటు ఆసుపత్రులు, స్వచ్ఛంద సంస్థలు తక్కువ ధరకు చికిత్స అందించేందుకు ముందుకు వస్తున్నాయన్నారు.
బేగంపేట్ లోని వివేకానంద హాస్పిటల్ యాజమాన్యం క్యాంపులు ఏర్పాటు చేసి చికిత్స అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఐదు నుండి 11 సంవత్సరాల పిల్లలకు వివేకానంద హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా కీటూ స్వచ్ఛంద సంస్థ సహకారంతో క్యాన్సర్ చికిత్స క్యాంపులను, మోకాలు మార్పిడి శస్త్ర చికిత్సలు చేయడం పట్ల మంత్రి ఈటెల హర్షం వ్యక్తం చేశారు.
ఏదన్నా సేవ చేస్తే ప్రజలు గుర్తు పెట్టుకుంటారు.. కానీ వైద్య రంగంలో సేవలు అందిస్తే గుండెల్లో పెట్టుకుంటారు అని మంత్రి అన్నారు. ఈ ట్రీట్మెంట్ సాధ్యమైనంత ఎక్కువమందికి అందించాలని వివేకానంద హాస్పిటల్ వారిని కోరారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న వారికి ప్రభుత్వం మద్దతు తప్పకుండా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివేకానంద అస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గీత, డైరెక్టర్లు డాక్టర్ రాజశేఖర్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.