భారత్ చైనా ల మధ్య గత కొద్ది నెలలుగా నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయనుకుంటున్న తరుణంలో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ముష్టియుద్ధంలో ముగ్గురు భారత వీరులు అమరులయ్యారు. భారత సైన్యానికి చెందిన ఒక కల్నల్ మరో ఇద్దరు సైనికులను చైనా బలగాలు చంపేశాయి.
గాల్వన్ లోయలో నేడు జరిగిన ఈ ముష్టియద్ధంలో ఈ దారుణం జరిగింది. ప్రస్తుతం ఇరు దేశాల సైనిక దళాల అధికారులు సమావేశం అయ్యారు. ఇదే సమయంలో ఇలా ఇరు దేశాల సైనికులు ఒకరితో ఒకరు హోరాహోరీ గా తలపడ్డారు. తూర్పు లడ్దాక్ లోని గాల్వన్ లోయ, డమ్ చోక్, దౌలత్ బెగ్ ఓల్డీల వద్ద జరిగిన ముష్టియుద్ధంలో ఈ దారుణం జరిగింది.
తుపాకులతో కాల్పుకూకుండా బాహాబాహీ జరిగిన ఈ యుద్ధంలో భారత్ కు భారీ నష్టం వాటిల్లింది. ఈ సంఘటనపై అధికారిక వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. గాల్వన్ లోయలో చైనా దళాలు గత రెండు రోజులుగా రెండు నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరం వెనక్కి జరిగాయి.
అదే సమయంలో భారత్ కూడా తన సైనాన్ని వెనక్కి పిలిచింది. ఇరు దేశాల సైనిక అధికారుల స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. ఈ దశలో జరిగిన ఈ సంఘటన ఇరు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తత రెచ్చగొట్టింది. భారత దళాలు తమ భూభాగంలోకి చొచ్చుకువచ్చాయని అందుకే తమ సైన్యం తిరగబడిందని చైనా అధికారికంగా ప్రకటించింది.