కొటారుబిల్లిలోరాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టీకరణ
పేద వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల అమలుకు అర్హతే ప్రామాణికమని ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పునరుద్ఘాటించారు. లంచాలకు తావులేకుండా, మధ్యవర్తిత్వంతో కూడిన సిఫార్సులు అవసరం లేకుండా పేదల సంక్షేమమే పరమావధిగా పారదర్శకతతో కూడిన పాలన అందిస్తున్నామని పేర్కొన్నారు. అర్హతల పునఃపరిశీలన నిమిత్తం జారీ చేసే నోటీసులపై కొంతమంది గిట్టని వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ.. వాటిని ఎవరూ నమ్మొద్దని మంత్రి బొత్స హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల మొత్తాన్ని పెంచిన నేపథ్యంలో, కొత్తవారికి పింఛన్లు మంజూరు చేసిన క్రమంలో ఉద్దేశించిన పింఛన్ల వారోత్సవాలను కొటారుబిల్లి వేదికగా మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ నోటీసుల జారీపై, అర్హతల నిర్ణయంపై కొంతమంది గిట్టని వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీన్ని ప్రజలు నమ్మొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. పేదల సంక్షేమం, అభివృద్ధే ప్రధాన అజెండాగా రాష్ట్ర సీఎం జగన్ పారదర్శకతతో కూడిన పాలన అందిస్తున్నారని గుర్తు చేశారు. నాడు ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో మూడు దఫాలు పింఛన్ల మొత్తాన్ని పెంచామని మంత్రి పేర్కొన్నారు. ఇప్పుడు 2,750 ఉన్న పింఛను వచ్చే ఏడాది నాటికి అన్నమాట ప్రకారం 3,000కి పెంచి తీరుతామని ఉద్ఘాటించారు. పథకాలు తీసుకునేందుకు ప్రజలు గతంలో ఎన్నో ప్రయాసలు పడేవారని ఇప్పుడా పరిస్థితి లేదని పేర్కొన్నారు. సామాన్యులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా స్థానిక సచివాలయాలను అందుబాటులోకి తీసుకొచ్చామని గుర్తు చేశారు.
లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగింది
వైకాపా అధికారంలోకి వచ్చిన రోజు జిల్లాలో 2.28 లక్షల మంది లబ్ధిదారులు ఉండగా.. నేడు ఆ సంఖ్య 2.83 లక్షలకు చేరిందని పేర్కొన్నారు. గిట్టని వారు అంటున్నట్లు పింఛన్లు తొలగిస్తే.. ఈ సంఖ్య ఎలా పెరుగుతుందని మంత్రి బొత్స ప్రశ్నించారు. మూడేళ్లలో 60 వేల మంది కొత్తవారికి వివిధ పథకాల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు అందించామని పేర్కొన్నారు. గజపతినగరం నియోజకవర్గానికి సంబంధించి 34 వేల ఉంచి 41 వేలకు లబ్ధిదారుల సంఖ్య పెరిగిందని, గంట్యాడ మండలానికి వస్తే 8వేల నుంచి 11 వేలకు చేరారని వివరించారు. పథకాల అర్హతకు సంబంధించి పునఃపరిశీలన చేసే నిమిత్తం జిల్లాలో 4,000 మందికి నోటీసులు ఇస్తే 736 మంది సరైన ధృవపత్రాలను సమర్పించలేకపోయారని, మరొక 1,236 మంది తాలూక అర్హతలను పరిశీలించాల్సి ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
అక్కచెల్లెమ్మలకు న్యాయం
జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక అక్కచెల్లెమ్మలకు నిజమైన న్యాయం జరిగింది. నాడు ఉండిపోయిన బకాయిలను తీరుస్తూ సీఎం తన హామీని నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. గజపతినగరం నియోజకవర్గంలో స్వయం సహాయక సంఘాలకు చెందిన 36 కోట్లు బకాయిలు ఉండిపోగా వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత 18 కోట్లు చెల్లించామని వివరించారు. జనవరి 29వ తేదీన మరొక 9 కోట్లు అక్కచెల్లెమ్మలకు అందుతాయని మంత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలో సభకు విచ్చేసిన స్వయం సహాయక సంఘాల సభ్యులు కరచాల ధ్వనులతో కృతజ్ఞతలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డి తండ్రికి తగ్గ తనయుడని… ప్రజలు మరొక సారి ఆశీస్సులు అందించాలని, దీవించాలని ప్రసంగం ముగింపులో మంత్రి బొత్స పేర్కొన్నారు.
ప్రతి సమస్యనూ పరిష్కరిస్తాంః బొత్స అప్పలనరసయ్య
స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ప్రారంభోపాన్యాసం నాయకులంటే సామాన్యులకు గౌరవం పెరిగిలే పని చేస్తున్నామని, అర్హతే ప్రామాణికంగా పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యనూ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి సహకరించాలి:జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
జిల్లా ప్రజల సాగునీటి అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రజలు సహకరించాలని జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. గంట్యాడ మండలం పూర్తిగా వర్షాధార ప్రాంతమని కావున ప్రజలు మంచి మనసుతో ఆలోచించి సహకరించాలని, ఈ ప్రాంతం గోదావరి జిల్లాల మాదిరిగా సస్యశ్యామలం కావాలని ఆకాంక్షించారు. పింఛన్ల పంపిణీ వారోత్సవాలు బృహత్తర కార్యక్రమమని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు సంపూర్ణమైన సంక్షేమం అందుతుందని గుర్తు చేశారు. పేదల కష్టాలను గుర్తించిన ముఖ్యమంత్రి ఈ నెల నుంచి 1 కేజీ బియ్యాన్ని ఉచితంగా అందజేసేందుకు నిర్ణయించారని పేర్కొన్నారు.
నోటీసులిచ్చినంత మాత్రాన తొలగించినట్లు కాదు -జిల్లా కలెక్టర్
అర్హతల పునః పరిశీలన నేపథ్యంలో జారీ చేస్తున్న నోటీసులపై సందేహాలకు తావులేదని.. నోటీసులిచ్చినంత మాత్రాన పింఛన్లు తొలగించినట్లు కాదని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి స్పష్టం చేశారు. అర్హతలను నిరూపించుకుంటే యథావిధిగా ఆర్థిక ప్రయోజనాలను అందిస్తామని పేర్కొన్నారు. సాంకేతిక కారణాలతో అక్కడక్కడ ఏర్పడిన ఇబ్బందులను తొలగించి అర్హతున్న ప్రతి ఒక్కరికీ పథకాలను వర్తింపజేస్తామని వివరించారు. జిల్లాలో గంట్యాడ మండల ప్రాంత ప్రజలు చురుగ్గా ఉంటారని, అభివృద్ధిలో కూడా ముందంజలో ఉంటారని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజలందరూ ప్రభుత్వ సేవలను సంపూర్ణంగా వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ కల్యాణ చక్రవర్తి, ఇతర అధికారులు, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, అధిక సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.