గతంలో ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో వై ఎస్ షర్మిలకు ఆస్తులు ప్రకటించే అవకాశం రాలేదు. కడప ఎంపిగా పోటీ చేస్తున్నందున తొలి సారి ఆమె తన ఆస్తుల్ని వెల్లడించారు. వైఎస్ షర్మిల ఎన్నికల అఫిడవిట్ లో ఆసక్తి కర విషయాలు వెల్లడయ్యాయి. తన అన్న, ఏపీ సీఎం జగన్కు రూ. 82 కోట్ల బాకీ ఉన్నట్లు షర్మిల తన అఫిడవిల్ లో పేర్కొన్నారు. వైఎస్ షర్మిలా రెడ్డి తన సోదరుడు జగన్మోహన్ రెడ్డిపై రాజకీయ పోరాటం చేస్తున్నారు.
అయితే సోదరికి జగన్ మోహన్ రెడ్డి రూ. 82 కోట్లకుపైగా అప్పు ఇచ్చారు. ఈ విషయాన్ని షర్మిల తన ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారు. షర్మిల మొత్తం ఆస్తూలు రూ. 182.82 కోట్లు ఉంటాయని అఫిడవిట్లో తెలిపారు. ఇందులో అప్పుల వివరాలు కూడా ఉన్నాయి. రూ. 82,58,15,000 అప్పును సోదరుడు జగన్ మోహన్ రెడ్డి వద్ద తీసుకున్నారు. అంతే కాదు తన వదిన వైఎస్ భారతీరెడ్డి వద్ద కూడ షర్మిల అప్పు చేశారు. ఆమె వద్ద రూ. 19,56,682 అప్పులు చేశారు. వీటిని తిరిగి చెల్లించాల్సి ఉంది.
షర్మిలకు ఏడాదికి ఆదాయం రూ. 97,14,213 వస్తుందని అఫిడవిట్లో తెలిపారు. షర్మిల భర్త అనిల్ కుమార్ ఆదాయం రూ. 3,00,261 మాత్రమేనని తెలిపారు. షర్మిల వెల్లడించిన ఆస్తుల్లో చరాస్తులు రూ. 123,26,65,163 గా తేల్చారు. 45,19,72,529 రూపాయల విలువైన చరాస్తులు ఆమె భర్త అనిల్ కుమార్ కలిగి ఉన్నారు. ఇక స్థిరాస్తులు తక్కువగా ఉన్నాయి. షర్మిలకు 9 కోట్ల 29 లక్షల 58 వేల 180 రూపాయల స్థిరాస్తులు మాత్రమే ఉన్నాయి. భర్త అనిల్ కుమార్కు ఇంకా తక్కువగా 4,05,92,365 విలువైన స్థిరాస్తులు మాత్రమే ఉన్నాయి.
భారతి రెడ్డిలకు చెల్లించాల్సిన అప్పు తప్ప ఇంకేమీ లేదు. వారిద్దరికీ ఇవ్వాల్సిన మొత్తం 82 కోట్ల 77 లక్షల 71,682 రూపాయలుగా ఉంది. అనిల్ కుమార్ అప్పులు రూ. 35,81,19,299 గా తేల్చాచారు. షర్మిల వద్ద 3 కోట్ల 69 లక్షల 36వేల విలువైన బంగారం ఉంది. అలాగే 4 కోట్ల 61 లక్షల 90 వేల 688 రూపాయల విలువైన వజ్రాభరణాలు ఉన్నాయి. అనిల్ కుమార్కు 81 లక్షల 60వేల విలువైన బంగారం.. 42 లక్షల విలువైన వజ్రాభరణాలు ఉన్నాయి. ఇక కడప స్థానానికి వైసీపీ తరపున నామినేషన్ వేసిన వైఎస్ అవినాష్ రెడ్డి తనకు రూ. 40 కోట్లు ఆస్తుల ఉన్నట్లుగా తెలిపారు. ఆయనకు ఐదేళ్ల కింద ఉన్న ఆస్తులు రూ. 19 కోట్లు మాత్రమే. ఐదేళ్లలో 116 శాతం పెరిగాయి.