ఏపీ సీఎం జగన్ కక్ష సాధింపు ధోరణితో తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడిపై మోపిన ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అభియోగాలలో ఎలాంటి పస లేదని తేలిపోయింది. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, సీమెన్స్ కంపెనీలతో కలిసి త్రైపాక్షిక ఒప్పందంలో భాగస్వామి అయిన డీజీ టెక్ కంపెనీ పూర్తి వివరాలు వెల్లడించడంతో జగన్ ప్రభుత్వం కేవలం కక్ష సాధించేందుకు మాత్రమే చంద్రబాబునాయుడిని అరెస్టు చేసిందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తున్నది.
డీజీ టెక్ కంపెనీ ఎండీ ఎండీ ఖాన్ విల్కర్ ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. ఒప్పందంలో ఎలాంటి స్కాం లేదని డీజీ టెక్ కంపెనీ ఎండీ ఖాన్ విల్కర్ విస్పష్టంగా చెప్పారు. ఏమీ లేనిదానికి స్కాం జరిగిందని చంద్రబాబును అరెస్ట్ చేయడం దురదృష్టకరం అని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తం వ్యవహారాన్ని వివరిస్తూ కంపెనీ తరపున వీడియో విడుదల చేసిన డీజీ టెక్ కంపెనీ ఎండీ ఖాన్ విల్కర్ తాము విచారణకు సిద్ధమని ప్రకటించారు.
ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం మేరకు రూ.371 కోట్ల విలువైన మొత్తం సామగ్రిని సరఫరా చేశామని ఆయన తెలిపారు. సరఫరా చేసిన మొత్తం ఎక్విప్మెంట్కు సంబంధించిన డేటాను వీడియోలో వివరించిన ఎండీ ఖాన్ విల్కర్ పరికరాలు నాసిరకంగా ఉన్నా, రిపేరుకు వచ్చినా పూచీ కూడా తీసుకున్నామని స్పష్టం చేశారు. సంబంధిత అంశాలపై ఒప్పందంలో స్పష్టంగా ఉన్నదని విల్కర్ స్పష్టం చేశారు.
అదే విధంగా ఈ ఒప్పందానికి సంబంధించి జీఎస్టీ స్కాం ఉందన్న ఆరోపణలు కూడా నిజం కాదని ఆయన వెల్లడించారు. ఏపీ దర్యాప్తు సంస్థలు ఈ స్కామ్కు సంబంధించి తమతో సంప్రదించలేదని కూడా డీజీ టెక్ ఎండీ ఖాన్ విల్కర్ వివరించారు. ఆడిటర్లను పంపితే పూర్తి లెక్కలు చూపుతామని కూడా విల్కర్ సంసిద్ధత వ్యక్తం చేశారు. డీజీ టెక్ కంపెనీ జారీ చేసిన ఈ వివరణ సంచలనం కలిగిస్తున్నది.
చంద్రబాబునాయుడి అరెస్టుపై జగన్ ప్రభుత్వం కక్ష సాధిస్తున్నదని ఇప్పటికే వెల్లడైన నేపథ్యంలో ఈ ప్రకటన కీలకమైనది. కేవలం రాజకీయ అవసరాల కోసం ప్రభుత్వాన్ని వాడుకోవడం, అందులోనూ సిఐడి పోలీసులను ఈ విధంగా వినియోగించుకోవడం దురదృష్టకరమనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.