లే-అవుట్ల అనుమతులను నిర్ణీత గడువులోగా, నిబంధనల మేరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో నగర పాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభితో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి లే అవుట్ అప్రూవల్ కమిటీ సమావేశంలో ఖమ్మం జిల్లా పరిధిలో లే-అవుట్ ఆమోదం కొరకై అందిన (20) దరఖాస్తులను కమిటీ సమావేశంలో పరిశీలించారు.
నిబంధనల మేరకు సమర్పించబడిన (8) దరఖాస్తులను కమిటీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో లే-అవుట్ల ఆమోదం కొరకు రెవెన్యూ, విద్యుత్, ఇర్రిగేషన్, రోడ్లు భవనాల, టౌన్ ప్లానింగ్ తదితర అనుబంధ శాఖల నుండి అనుమతులకై సమర్పించిన దరఖాస్తులను ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేసి, స్థల పరిశీలన చేసిన మీదట 21 రోజుల లోపు అనుమతులను జారీచేయాలని తదనుగుణంగా జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమోదించడం జరుగుతుందని అన్నారు. గ్రీనరీ కొరకు కేటాయించిన స్థలాన్ని వెంటనే స్వాధీనపర్చుకొని మొక్కలు నాటాలన్నారు.
లేఅవుట్ డెవలపర్స్ కూడా నిబంధనల మేరకు చట్టబద్దంగా సమగ్ర ప్రణాళికబద్దంగా ల్యాండ్ డెవలప్మెంట్ పనులు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో ఎస్డీసి రాజేశ్వరి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.వి.అప్పారావు, పంచాయితీరాజ్ ఇ.ఇ కెవికె. శ్రీనివాస్, ఇర్రిగేషన్ ఇఇ వెంకటేశ్వర్లు, వెంకట్రాం, ఏడి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాసులు, డిటిసిపిఓ ప్రసాద్, టిపిఓ వికాస్, సత్తుపల్లి మున్సిపల్ కమీషనర్ సుజాత, అధికారులు తదితరులు పాల్గొన్నారు.