విద్యుత్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని CPM జిల్లా నాయకులు జిట్ట నగేష్,అవిశెట్టి శంకరయ్య లు డిమాండ్ చేశారు. ఆదివారం నాడు చిట్యాల మండల కేంద్రంలో CPM ఆధ్వర్యంలో ప్రభుత్వ సంస్కరణలను నిరసిస్తూ ధర్నా, దీక్షలను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని BJP ప్రభుత్వం కొత్తగా చేసే విద్యుత్ సంస్కరణల వలన రైతులకు, మధ్యతరగతి పేదలకు అధిక భారం పడుతోంది అని అన్నారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఇండ్లలో ఉన్న ప్రజలకు కరెంటు చార్జీలు పెంచే యోచన చేయడం విచారకరమని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వాల ఆజమాయిషీని తగ్గిస్తూ, విద్యుత్ ను పూర్తిగా ప్రైవేట్ పరం చేసి,బడా కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పాలనే యోచనను మానుకోవాలని కోరారు. ఈ నిర్ణయం వలన రైతులకు ఇచ్చే ఉచిత కరెంటుతోపాటు వివిధ వర్గాల ప్రజలకు ఇచ్చే రాయితీలు కూడా రద్దు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయం లో ప్రభుత్వం ఆలోచించి ఉపసంహరించకపోతె అన్ని వర్గాల ప్రజలను సమీకరించి ఆందోళనలు, పోరాటాలు చేయవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు శీలా రాజయ్య, కత్తుల లింగస్వామి,ఐతరాజు నర్సింహ, జిట్ట సరోజ, జోగు లక్ష్మియ్య, మెట్టు పరమేష్,రుద్రారపు పెద్దులు ,శేఖర్ నరసింహ తదితరులు పాల్గొన్నారు.