రాబోయే వర్ష కాలాన్ని దృష్టిలో పెట్టుకుని డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వ్యాధుల నివారణ కోసం దోమలను తరిమికొట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి రమేష్ పేర్కొన్నారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక సూచన మేరకు పది వారాల పాటు ప్రతి ఆదివారం 10 గంటలకు 10నిమిషాల పాటు ఎంటమాలజీ శాఖ వారిచే తమ ఇళ్లలో దోమలను తరిమికొట్టే కార్యక్రమానికి నల్లకుంట డివిజన్ కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి రమేష్ అవగాహన కల్పించారు.
నల్లకుంట ప్రాంతం లోని ఇందిర నగర్, పెద్ద గణపతి లైన్, తిలక్ నగర్ శివాలయం లైన్లోని అపార్ట్మెంట్ లలో, పరిసరాలలో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఇంటి పరిసరాలు, గార్డెనింగ్, తదితర ప్రాంతంలో ఎక్కడా నీరు నిల్వలేకుండా చేసి దోమల మందు పిచికారి చేయించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కేటీఆర్ సూచన మేరకు డివిజన్ పరిధిలోని ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దోమలు వృద్ధి చెందకుండా ఇళ్లలోని కూలర్లు, టైర్లు, పాతబడిన వస్తువుల్లో నీరు నిలబడకుండా చేయాలన్నారు. మలేరియా, డెంగ్యూ వ్యాధులను ఆరంభంలోనే అరికట్టాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాల పాటు దోమలపై యుద్దం చేద్దామని కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి రమేష్ పిలుపునిచ్చారు.