మహిళలకు రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల మూలంగా రాష్ట్రంలో మహిళలకు ప్రతిరోజూ మహిళా దినోత్సవం అయిందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. విశాఖలోని సర్క్యూట్ హౌస్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ దశల వారీ మద్యపాన నిషేధం మూలంగా మహిళలకు ఎంతో మేలు జరిగిందన్నారు.
మహిళలపై దాడులు తగ్గడమే కాకుండా ఎన్నో కుటుంబాలలో సుఖసంతోషాలు, ఆర్థిక పరిస్థితి మెరుగయిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా మహిళల భద్రతకు చర్యలు ప్రారంభించిందనీ, దిశ చట్టం మూలంగా మహిళలలో ఆత్మస్థైర్యం పెరిగిందన్నారు. అన్ని రంగాలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలవుతోందని చెప్పారు.
తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఎన్ని రకాలుగా మేలు జరుగుతున్నందున మహిళా దినోత్సవాన్ని పండగలా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. మహిళల సంక్షేమానికి, భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, మహిళలు అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతున్నారని తెలిపారు.
రాష్ట్రంలో 18 దిశ పోలీస్ స్టేషన్లు 8వ తేదీ నుండి ప్రారంభమవుతాయని, దిశ యాప్ ని అందరూ డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. దిశ చట్టం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. చట్టం త్వరగా అమలయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని ఆమె కోరారు. సామాజిక మాధ్యమంలో మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసినా, మహిళలను వేధించినా వారిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం రాష్ట్రప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపిస్తోంది అన్నారు. మహిళలను ఆర్థికంగా మరింత అభివృద్ధి చేసేందుకు, మహిళల ఆరోగ్యానికి ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. 45 సం. నుండి 60 సం. వయసు ఎస్సీ ఎస్టీ బిసి మహిళలకు 4 ఏళ్లలో రూ. 75 వేలు అందజేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించ నున్నదని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన మహిళా సంక్షేమ కార్యక్రమాల వల్ల త్వరలో గుణాత్మకమైన మార్పు కనిపిస్తుందన్నారు.
చిత్తూరులోని హర్షిత కేసు విషయంలో మహిళా కమిషన్ వేగంగా స్పందించి పోస్కో చట్టం క్రింద నిందితుడికి శిక్షపడేలా చేసిందన్నారు. రేపు జరిగే మహిళా దినోత్సవం లో మహిళలు, విద్యార్థులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, మానవ హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.