కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు గత 9 రోజులుగా సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు వైఎస్ఆర్టిపి మద్దతు తెలిపింది. సమ్మె చేస్తున్న జేపీఎస్ ల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు నాయకులు. ఈ సందర్బంగా వైఎస్ఆర్టిపి కామారెడ్డి నియోజకవర్గ ఇంచార్జి నీలం రమేష్ మాట్లాడుతూ.. జేపీఎస్ లు చేస్తున్న డిమాండ్స్ న్యాయమైనవేనన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రొహిబిషన్ పీరియడ్ గడిచిపోయినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. వెంటనే జేపీఎస్ లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. జేపీఎస్ లకు వైఎస్ఆర్టిపి మద్దతుగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్టిపి జిల్లా అధ్యక్షుడు నీలం సుధాకర్, ఎల్లారెడ్డి నియోజకవర్గ కోఆర్డినేటర్ జమున రాథోడ్, కామారెడ్డి నియోజకవర్గ యూత్ అధ్యక్షులు రాము, పట్టణ అధ్యక్షులు ఎండీ తాహెర్, నాయకులు పాల్గొన్నారు.