ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ స్థానానికి జరగనున్న ఎన్నికలకు అవసరమైన ఖర్చుల కోసం రూ.1,84,44,715లు విడుదల చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) ముఖేష్కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఎన్నికకు అయ్యే ఖర్చు మొత్తాన్ని జిల్లాకు ఇచ్చేవారు. ఈసారి అలా కాకుండా ఉత్తరాంధ్ర పరిధిలోని ఆరు జిల్లాలకు వేరువేరుగా కేటాయింపులు చేశారు. విశాఖ జిల్లాకు అత్యధికంగా రూ.80,67,079 కేటాయించారు. శ్రీకాకుళానికి రూ.27,95,804. విజయనగరానికి రూ.34,11,829, పార్వతీపురం మన్యం జిల్లాకు రూ.11,37,276, అల్లూరి సీతారామరాజు జిల్లాకు రూ.7,10,798, అనకాపల్లి జిల్లాకు రూ.23,21,938 చొప్పున కేటాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విశాఖలో ఎన్నికల ఖర్చుకు రూ.3కోట్ల మేర అవసరమని జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలను పంపింది. అయితే కేవలం రూ.80.67 లక్షలు మాత్రమే విడుదల కావడం గమనార్హం.
previous post