వరంగల్ మెడికో విద్యార్ధిని ప్రీతి మృతి అత్యంత బాధాకరమని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న ప్రీతి చనిపోవడం తన మనసును తీవ్రంగా కలిచివేస్తోందన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్య అని ఆయన అన్నారు. ఫిర్యాదు చేయగానే ప్రభుత్వం పట్టించుకోకపోవడంవల్లే ఈ దారుణం జరిగిందని బండి సంజయ్ అన్నారు. మీరిచ్చే 10 లక్షల సాయం… ఆ తల్లిదండ్రుల గుండెకోతను చల్లార్చుతాయా? అని అన్నారు. ప్రీతి చావుకు కారకుడైన మనిషికి ఇన్నాళ్లు వకాల్తా పుచ్చుకోవడానికి సిగ్గులేదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో రైతులు, కార్మికులు, ఉద్యోగులు, నిరుద్యోగులుసహా ఎంతో భవిష్యత్తు ఉన్న పసిపిల్లలు, విద్యార్థులు చనిపోవడం అత్యంత దుర్మార్గమని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్ట ప్రసక్తే లేదన్నారు.
ప్రీతి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రీతి మరణానికి కారకులైన దుర్మార్గులను శిక్షించే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. మేధావులు, విద్యావేత్తలుసహా సభ్యసమాజం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ప్రీతిలాంటి అమ్మాయిలకు ఈ దుస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు.