మైనార్టీల కోసం లక్ష రూపాయల స్కీం ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలనలో ఉందని, త్వరలో స్కీమ్ అమలవుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. జల విహార్లో మైనార్టీ నేతల సమావేశం నిర్వహించారు. పలు మైనార్టీ కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమితులైనవారిని మంత్రి మహమూద్ అలీతో కలిసి సన్మానించారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ మైనార్టీలను సీఎం ఎంతో గౌరవిస్తారని రెండు పర్యాయాలు మహమూద్ అలీని మంత్రిగా చేశారని తెలిపారు. హిందువులకు కల్యాణ లక్ష్మి తెచ్చినట్టు మైనార్టీల కోసం షాదీ ముబారక్ తెచ్చారని, సీఎం మైనార్టీలకు త్వరలోనే శుభవార్త చెప్పనున్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అని మండిపడ్డారు. దేశంలో ఇప్పటికీ ముస్లింలు ఇంకా పేదవారిగానే ఉన్నారని ఇదంతా కాంగ్రెస్ పార్టీ పాలన వల్లనే అని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వం ఈ బడ్జెట్లో మైనార్టీలకు రూ.2200 కోట్లు ప్రవేశ పెట్టినట్లు తెలిపారు.