మణిపూర్లో జరిగిన అఘాయిత్యాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. నేరస్తులను శిక్షించే విషయంలో ఇప్పటివరకు ఏం చేయలేకపోయారని కేంద్ర, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాలపై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ మండిపడింది. మణిపూర్ ఘటనను సుప్రీం కోర్టు సుమోటాగా స్వీకరించింది.
సదరు వీడియో దిగ్భ్రాంతికి గురి చేసేదిలా ఉందన్న సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.మే 3వ తేదీన ఈ ఘటన జరిగిందని అంటున్నారు. అలాంటప్పుడు ఇంతకాలం ఎలాంటి చర్యలు తీసుకున్నారు? కొంత సమయం ఇస్తున్నాం.
ఈలోపు చర్యలు తీసుకోండి. లేదంటే మేం రంగంలోకి దిగుతాం. ప్రజాస్వామ్యానికి ఇది ఆమోదకరమైన విషయం కాదు అని పేర్కొంటూ తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.