అసలే కరోనా కాలం పిలిస్తే పలికే నాధుడే లేడని ఆందోళన చెందుతున్న ఆ తల్లికి ఆపద్భాంధవుల్లా వచ్చారు 108 సిబ్బంది. ఉప్పల్ ప్రాంతంలోని మేడిపల్లికి చెందిన స్వాతి నెలలు నిండిన గర్భవతి. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే నేటి తెల్లవారు జామున నొప్పులు వచ్చాయి.
పిలిస్తే పలికేవారుంటారా అని ఆందోళన చెందుతూనే ఆమె భర్త నాగరాజు 108కు ఫోన్ చేశాడు. ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని. వెంటనే వచ్చేసింది 108. స్వాతిని తీసుకుని సిపిఆర్ఐ సంస్థ వద్దకు రాగానే స్వాతికి నొప్పులు పెరిగిపోయాయి. ఏం చేయాలి? అంబులెన్సు పైలెట్ భద్రు, సహాయకుడు సతీష్ అంబులెన్సును పక్కన నిలిపేశారు. తమకు తెలిసిన రీతిలో స్వాతికి క్షేమంగా డెలివరీ చేయించారు.
స్వాతి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ సేఫ్. సరిగ్గా తెల్లవారు జామున 3 గంటల 5 నిమిషాలకు డెలివరీ అయింది. వైద్యులు కాని ఈ వైద్యులకు ఏమిచ్చి ఆ రుణం తీర్చుకోవాలి? దేవదూతల్లా వచ్చి తల్లిని బిడ్డను కాపాడిన ఈ వైద్య సిబ్బందే మనకు కనిపించే దేవుళ్లు.