అనారోగ్యంతో తన ప్రాణం పోయేలా ఉందని తక్షణమే తనను చెరసాల నుంచి విడుదల చేయాలని సౌదీ అరేబియా రాజకుమారి బస్మా బిన్ సౌద్ సౌదీ రాజును కోరారు. అనారోగ్య కారణాలతో చికిత్స కోసం వెళుతుండగా గత ఏడాది మార్చి నెలలో రాజకుమారిని ఆఖరు నిమిషంలో నాటకీయంగా పట్టుకుని అరెస్టు చేశారు.
అప్పటి నుంచి ఆమె ఖైదీగా ఉన్నారు. తన ఆరోగ్యం రోజు రోజుకూ క్షీణిస్తున్నదని, తనకు తక్షణమే చికిత్స అందించాలని ఆమె కోరుతున్నారు. అయితే ఆమె కోరికను మన్నించే స్థితిలో సౌదీ రాజు సల్మాన్ కనిపించడం లేదు. రాజ్యాధికారాన్ని గుప్పిటిలో పెట్టుకున్న యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఆమెను విడుదల చేసేందుకు సుముఖంగా లేరు.
రియాద్ కు దగ్గరగా ఉండే అత్యంత భారీ భద్రతతో రాజకీయ ఖైదీలను ఉంచే అల్ హైర్ కారాగారం నుంచి ఆమె ట్విట్టర్ ద్వారా ఈ వినతిని బయటకు ఎలా పంపించిందో అర్ధం కావడం లేదు. అంతర్గత విషయాలను కోట దాటి బయటకు చెప్పడం నిషేధం ఉన్న వంశంలో అంతర్గత విషయాలను బయటకు చెప్పిన తొలి వ్యక్తిగా ఈ యువరాణి ఉంటుంది.
ఇది కూడా ఆమె చేసిన నేరంగానే అక్కడ పరిగణిస్తారు. త్వరలో రాజ్యాధికారం చేపట్టబోతున్న మహమ్మద్ బిన్ సల్మాన్ తన ప్రత్యర్థులను పూర్తిగా అణచి వేస్తున్నారు. తన కు పోటీగా భావించే రాజ వంశానికి చెందిన వారిని అందరికి ఇప్పటికే అరెస్టు చేశాడు. ఇతని వ్యవహార శైలిపై అక్కడ తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.