ప్రతి నిత్యం శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామికి ప్రసాదం నైవేద్యం పెడుతున్న చేతులు ఇప్పుడు నిరుపేదల కడుపు నింపుతున్నాయి. నిరాశ్రయులైన వారి ఆకలి తీరుస్తున్నాయి. స్వామికి నైవేద్యం పెట్టినంత పరిశుభ్రంగా ఇంట్లోనే వండి వాటిని ప్యాక్ చేసిన ఆహార పదార్ధాలను ఆకలితో ఉన్నవారికి పంచిపెడుతున్నారు శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ముఖ్య అర్చకులు కొడకండ్ల మాధవాచార్యులు.
ఇంట్లోని వారే ఈ ప్రసాదాలను తయారు చేస్తున్నారు. వాటిని ప్యాక్ చేస్తున్నారు. ఆ ప్యాకెట్లను మాధవాచార్యులు తనతో తీసుకువెళ్లి పేదలకు పంచి పెడుతుంటారు. నిత్యం పేదవారికి ఆయన చేస్తున్న సేవ ఇది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఎంతో మంది ఆకలితో ఉండటం చూసిన మాధవాచార్యులు మనసు చలించి ఈ మానవ సేవ చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు, విధినిర్వహణలో అంకితమై ఉన్న పోలీసులకు, స్వచ్ఛంద సేవ అందిస్తున్న వాలంటీర్లకు ఆయన ఆహార ప్యాకెట్లు అందచేస్తున్నారు.
తన శక్తి ఎంత వరకూ ఉంటే అంత వరకూ ఆయన ఆహార ప్యాకెట్లు అందిస్తున్నారు. రెండు వందల ప్యాకెట్ల వరకూ తయారు చేసి పంపిణీ చేస్తున్నారు. ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు కూడా ఈ ప్రసాదం అందుకుంటున్నారు. ఎప్పుడూ గుడికి రాని ఈ భక్తులు ఆ దేవుడే తమ వద్దకు వచ్చి ప్రసాదం పంచుతున్నట్లుగా వారు చేతులెత్తి మొక్కుతున్నారు. దేవస్థానం తులసీ కాటేజీ, గోశాల వద్ద పని చేసే వారు కూడా ఈ ప్రసాదంతోనే ఆకలి తీర్చుకుంటున్నారు.