రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 9 మెడికల్ కాలేజీల్లో తరగతులను ఈ నెల 15న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఏకకాలంలో ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని మంత్రులు కేటీఆర్, హరీశ్రావు పిలుపునిచ్చారు. కాలేజీలు ప్రారంభంకానున్న కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్,నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామ జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్, హరీష్ రావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ 15న జరిగే మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, ఆయా జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు చేయాలని సూచించారు. కనీసం 15-20 వేల మంది పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటుతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ప్రజలకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు. మెడికల్ కాలేజీ ఏర్పాటుతో విద్యార్థులకే కాకుండా, దానికి అనుబంధంగా అందుబాటులోకి వచ్చే దవాఖానతో ప్రజలకు అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందుతాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల పరిధిలోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు 15న జరిగే కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
మెడికల్ కాలేజీల వల్ల కలిగే ప్రయోజనాలు ప్రజలకు అర్థమయ్యే రీతిలో యువతను, విద్యార్థులను భాగస్వాములను చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ స్వయంగా ఒక మెడికల్ కాలేజీని సందర్శించి తరగతులు ప్రారంభించే అవకాశం ఉన్నదని తెలిపారు. కామారెడ్డిలో జరిగే కార్యక్రమంలో మంత్రి హరీశ్రావు పాల్గొంటారని చెప్పారు. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు దకింది కేవలం రెండు మెడికల్ కాలేజీలేనని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. రెండు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లు మెడికల్ కాలేజీల మంజూరు విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం చేశాయని మండిపడ్డారు.
ఈ విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలని సూచించారు. జాతీయ పార్టీలు మోసం చేసినా సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో.. దేశంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని స్పష్టంచేశారు. 15న ఒకేసారి 9 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభించామన్నారు.దేశంలో సగటున అతి ఎక్కువ ఎంబీబీఎస్ సీట్లు కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని మంత్రి కేటీర్ పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి లక్ష జ నాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయని చెప్పారు.
ఈ విషయంలో 2014లో చిట్టచివరి స్థానంలో ఉన్న రాష్ట్రం నేడు అగ్రస్థానానికి చేరిందని స్పష్టంచేశారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా పెరిగిన ఎంబీబీఎస్ సీట్లలో 43 శాతం తెలంగాణలోనే పెరిగాయని, ఇది గొప్పవిషయమని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కేటాయించలేదని మండిపడ్డారు. 50 ఏండ్లకుపైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమ ఒత్తిడి వల్ల నిజామాబాద్, ఆదిలాబాద్లో మాత్రమే మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు.
రాష్ట్రం వచ్చిన రోజు తెంలగాణలో ఐదు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని, ఈ ఏడాదితో ఆ సంఖ్య 26కు పెరిగిందని స్పష్టంచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థులు వైద్య విద్య కోసం పక రాష్ట్రాలకు లేదా ఉక్రెయిన్, రష్యా వంటి దేశాలకు వెళ్లి అనేక కష్టాలు పడి చదువుకునేవారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ సంకల్పం మేరకు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతో ఇప్పుడు తెలంగాణ విద్యార్థులు స్వరాష్ట్రంలో ఎలాంటి కష్టం లేకుండా వైద్య విద్యను అభ్యసిస్తున్నారని చెప్పారు. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో అందుబాటులోకి వచ్చిన నూతన వైద్య సౌకర్యాలను ప్రజలకి వివరించాలని ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు.