మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలనే ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ చేపట్టిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం కోటపాడు గ్రామంలోని మాచినేని చెరువులో ప్రభుత్వం పంపిణీ చేసిన 75 వేల చేప పిల్లలను (రోహు, మ్రిగాల, కట్ల రకాల చేప పిల్లలు) మంత్రి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి చెరువులో వదిలారు. ముందుగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మత్యకారుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేశారని, నాడు చేపలను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి నేడు ఎగుమతి చేసుకునే స్థాయికి వెళ్లామన్నారు.
రైతు బంధు, రైతు భీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు పార్టీలకతీతంగా అర్హులందరికీ ప్రభుత్వం అందిస్తుందని ఆయన తెలిపారు. మధ్యవర్తుల వ్యవస్థను రూపుమాపడం కోసం ప్రభుత్వం రాయితీపై చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి మరోసారి గుర్తు చేశారు.
ఇతర రాష్ట్రాల్లో చేపలను విక్రయించడానికి వాహనాలను రాయితీపై ఇచ్చిందని తెలిపారు. నీలి విప్లవంను ప్రోత్సహించేందుకు మత్స్యసంపదను సృష్టిస్తున్నరని అన్నారు. సబ్బండ వర్గాల కులవృత్తులను ప్రోత్సహిస్తూ వారికి అండగా ప్రభుత్వం నిలుస్తుందన్నారు. ఖమ్మం జిల్లాలో సహజ నీటి వనరులపై ఆధారపడి నేటివరకూ జిల్లాలో 186 సహకార సంఘాల నమోదు అయ్యాయన్నారు.
ప్రాథమిక సంఘాలు 143, మహిళ సంఘాలు 30, హరిజన సంఘాలు 6, గిరిజన సంఘాలలో 14031 మంది మత్స్యకారులకు సభ్యత్వం కల్పించామన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, 2023-24 సంవత్సరానికి గాను 100 శాతం రాయితీపై జిల్లాలోని 903 చెరువుల్లో 362.59 లక్షల చేప పిల్లలు వదులుటకు లక్ష్యం నిర్ణయించామన్నారు.
ఖమ్మం నియోజకవర్గంలోని 54 నీటి వనరుల్లో 3.35 లక్షల చేప పిల్లలు వదలనున్నట్లు ఆయన తెలిపారు. నిబంధనల మేరకు చేప పిల్ల సైజు, రకం, సంఖ్య ఉండేలా అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు.
ప్రభుత్వం 100శాతం రాయితీపై ఖమ్మం జిల్లాలో 551 చెరువులలో 2.02కోట్ల చేప పిల్లలను ఆయా చెరువుల్లో వదిలేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.