ఓటు ప్రాధాన్యతను యువతకు తెలియజేసేలా, 18 సంవత్సరాలు నిండిన యువత ఓటరుగా నమోదు అయ్యెలా బి.ఎల్.ఓలు తమ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అన్నారు. ఓటర్లకు సంబంధించి పెండింగ్ దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి, మద్దులపల్లి, ముదిగొండ మండలం ముదిగొండ, మేడేపల్లి, యడవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటరు నమోదు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.
ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ఎన్ని ఫారాలు స్వీకరించింది అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రం పరిధిలో ఎన్ని డూప్లికేట్ ఓటర్లు ఉన్నది, ఓటుకు ఫోన్ నెంబర్ ట్యాగ్ చేసింది, పోలింగ్ కేంద్ర పరిధిలో ఎంతమంది ఓటర్లు ఉన్నది, ఎంత మంది 18-19 సంవత్సరముల వయస్సు కలిగిన ఓటర్లు ఉన్నది, ఓటరు నిష్పత్తిలో ఎంత మంది ఉండాల్సింది అడిగి తెలుసుకున్నారు. కేంద్ర పరిధిలో ఉంటున్న విఐపి, వివిఐపిలు ఓటర్ల జాబితాలో ఉన్నది లేనిది చూడాలన్నారు. సెక్టార్ అధికారులు తమ తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాల సందర్శన చేయాలని ఆయన తెలిపారు.
ప్రతిరోజు ఇంటింటి నుండి చెత్తను సేకరించే శానిటేషన్ వాహనాల ద్వారా స్పేషల్ క్యాంపేయిన్ డే గురించి ప్రజలకు తెలియజేసేలా వాయిస్ సందేశాన్ని ప్రచారం చేయాలన్నారు. స్పెషల్ క్యాంపేయిన్ డే లు నిర్వహించే చోట బ్యానర్లను ఏర్పాటు చేయాలని, ఓటరు జాబితాలో ఫోటో, ఇతర మార్పులు ఉన్నట్లయితే వాటిని ఫామ్-8 ద్వారా ఓటర్లతో నమోదు చేయించేలా బిఎల్ఓ లు చర్యలు చేపట్టాలని తెలిపారు.
బిఎల్ఓ రిజిస్టర్, ఓటర్ల నమోదు పత్రాలను కలెక్టర్ పరిశీలించారు. విఆర్ఏ లు బిఎల్ఓ లుగా ఉండి, ఇతర శాఖల్లో సర్దుబాటు అవగా, అట్టి వారి నుండి బిఎల్ఓ రిజిస్టర్లు, ఫారాలు క్రొత్త బిఎల్ఓ లకు అప్పగించేలా చర్యలు చేపట్టాలన్నారు. క్రొత్త బిఎల్ఓ లకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయాలన్నారు. అక్టోబర్ 1, 2023 నాటికీ 18 సంవత్సరాలు నిండిబోయే వారందరూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని అన్నారు.
పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి, పోలింగ్ కేంద్రాల్లో బిఎల్ఓలు డ్రాఫ్ట్ ఫోటో ఎలక్టోరల్ హార్డ్ కాపీ, అన్ని రకాల ఫారాలతో అందుబాటులో ఉంటారని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. పర్యటన సందర్భంగా ఖమ్మం రూరల్ మండలం తెల్దారు పల్లిలో వెంచర్ లే అవుట్, గ్రీన్బెల్ట్ స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు.
ముదిగొండ మండలం యడవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మనఊరు `మనబడి పనులను పరిశీలించి ఈ నెల 30లోపు పనులన్నీ పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.