అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక శ్రీ సిద్ధేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 29 నుండి జులై 7వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు జూన్ 28వ తేది సాయంత్రం 5 గంటలకు అంకురార్పణ నిర్వహిస్తారు. జూన్ 29న ఉదయం 7.38 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మో త్సవాలు ప్రారంభమవుతాయి. సాయంత్రం హంసవాహన సేవ నిర్వహిస్తారు. జూన్ 30, జులై 1, 2, 3వ తేదీల్లో ఉదయం పల్లకీ ఉత్సవం నిర్వహిస్తారు.
అదేవిధంగా జూన్ 30న సాయంత్రం చంద్రప్రభ వాహనం, జులై 1న సాయంత్రం చిన్నశేష వాహనం, 2న సాయంత్రం సింహ వాహనం, 3న సాయంత్రం నంది వాహనసేవ జరుగుతాయి. జులై 4న సాయంత్రం 6 గంటలకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఆ తరువాత రాత్రి 7.30 గంటలకు గజవాహనంపై స్వామివారు విహరించనున్నారు.
జులై 5న సాయంత్రం పల్లకీ సేవ, 6న సాయంత్రం 6 గంటలకు పార్వేట ఉత్సవం, 7న ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు త్రిశూలస్నానం, సాయంత్రం 5 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాలలో ప్రతి రోజు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 6 గంటలకు వాహన సేవలు నిర్వహిస్తారు.
జులై 8వ తేదీన పుష్పయాగం నిర్వహిస్తారు. ఉదయం 9 గంటలకు శ్రీసిద్ధేశ్వరస్వామివారి ఉత్సవర్లకు పనతిరుమంజనం, సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం ఘనంగా జరుగనుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.