ఇదేదో రోడ్డు ప్రమాదం కాదు… పిడుగు పడలేదు… కొట్టుకోలేదు…. అయినా ఏడుగురు గాయపడ్డారు… ఎలా? తమ జోలికి వచ్చిన వారిపై దాడి చేశాయి… తేనెటీగలు.
అంతే తేనెటీగల దాడిలో ఏడుగురు గాయపడ్డారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలం పాలిత్యా తండాలో చోటు చేసుకుంది.
సోమవారం మధ్యాహ్నం సమయంలో ఇంటి ముందు చిన్నారులు ఆడుకుంటున్నారు. వీరికి తోడుగా వీరమ్మ అనే మహిళ కాపలాగా ఉంది. పిల్లలు రాళ్లు విసిరేస్తూ ఆడుకుంటున్న సమయంలో ఎదురుగా సర్కారు తుమ్మ చెట్టుకు ఉన్న తేనె తుట్టెకు తగిలింది.
దీంతో తేనెటీగలు ఆరుగురు చిన్నారులతో పాటు వీరమ్మ అనే మహిళపై దాడి చేశాయి. పిల్లల అరుపులతో చుట్టుపక్కల వారు వచ్చి వీరిని ఇంట్లోకి తీసుకెళ్లి రక్షించారు.
అనంతరం వీరిని గూడూరు దవాఖానకు తరలించగా .. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి మహబూబాబాద్ జిల్లా దవాఖానకు తరలించారు.
వీరిని పరీక్షించిన వైద్యులు ప్రమాదమేమీ లేదని తేల్చి చెప్పడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.